AP SSC Advanced Supplementary 2026: ఇవాళ్టి నుంచే టెన్త్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తులు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో మొత్తం 85.25 శాతం మేర ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఈ ఫలితాల్లో కొందరు విద్యార్ధులు కొన్ని సబ్జెక్టుల్లో తప్పారు. మరికొందరు విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. వీరందరికీ విద్యాశాఖ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను తాజాగా ప్రకటించింది.

అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒకటి రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు తమ సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడానికి పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మే 1 నుంచే అంటే ఈ రోజు (శుక్రవారం) ప్రారంభం అవుతుంది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు నేరుగా ఫీజు చెల్లించవచ్చు. ఇక రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1 నుంచి మే 7 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేవలం కొన్ని మార్కులతో ఫెయిలైన విద్యార్ధులు ఎవరైనా ఉంటే ముందుగా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల పేపర్ మూల్యాంకనంలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. వీరంతా మే 9, 2026వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రూ. 50 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. రీకౌంటింగ్కు ప్రతి సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్కు ప్రతి సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
- పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీలు: మే 1 నుంచి మే 9వ తేదీ వరకు
- రూ.50 ఆలస్య రుసుముతో చివరి తేదీ: 25 మే, 2026వ తేదీ వరకు
- పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు: 25 మే, 2026 నుంచి 4 జూన్, 2026వ తేదీ వరకు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




