
వైజాగ్… ఇక ఇంటర్నేషనల్ లెవల్లో ఐకాన్గా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా సరికొత్త హంగలును సంతరించుకుంటోంది సాగరతీరం. డిసెంబర్ నుంచి ఏపీ పరిపాలన ఇక విశాఖపట్నం నుంచే మొదలు కానుంది. ఈమేరకు వసతులు సిద్ధమవుతున్నాయి కూడా! అవును.. డిసెంబర్ లోగా విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
విశాఖపట్నంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపునకు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ లోగా విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందని స్పష్టత ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. తాను కూడా విశాఖకు ఫిష్ట్ అవుతానన్నారు. సీఎంవో సహా సంబంధిత కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి త్రిసభ్య కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తుందన్నారు. డిసెంబర్ లోపు విశాఖకు మారుతామన్నారు. అక్టోబర్ నెలలోనే విశాఖకు షిప్ట్ అవ్వాలనుకున్నప్పటికీ.. డిసెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానన్నారు జగన్. మధురవాడ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారాయన. విశాఖ ఐటీ హబ్ మారుతున్నందుకు సంతోషంగా వుందన్నారు.
ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఇందుకోసం వివిధ భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తుంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డిసెంబర్ నుంచి విశాఖ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మునిసిపల్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో పాటు పరిపాలనశాఖ కార్యదర్శులతో కూడిన త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మిలీనియం టవర్స్తో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించినట్టు సమాచారం. ప్రధానంగా మిలీనియం టవర్స్లో అందుబాటులో ఉన్న 2 లక్షల చదరపు అడుగుల భవనాలను అధికారుల త్రిసభ్య కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం.
అలాగే గ్రే హౌండ్స్లో ఉన్న భవనాలనూ కమిటీ పరిశీలించింది. ఇక్కడ పోలీసుశాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వీఎంఆర్డీఏ కు చెందిన వివిధ భవనాలను కూడా త్రిసభ్య కమిటీ స్వయంగా పరిశీలించింది. వీఎంఆర్డీకు చెందిన భవనాల్లో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వైద్యారోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు అరిలోవలోని విమ్స్ నుంచి విధులకు హాజరయ్యే అవకాశం ఉందని త్రిసభ్య కమిటీ ప్రాథమికంగా భావించినట్టు సమాచారం. ఇక ఇక్కడకు వచ్చే అధికారులకు అవసరమైన వసతి సౌకర్యాలను మాత్రం ఆయా శాఖలే చూసుకోవాలని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..