AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: రెప్పపాటులోనే ఘోరం.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం..

శుభకార్యానికి వెళ్తున్న ఐదుగురి ప్రయాణం విషాదంగా ముగిసింది. విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..

Vizag: రెప్పపాటులోనే ఘోరం.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం..
Road Accident
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 19, 2026 | 5:39 PM

Share

విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుడు అంతా పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమళ్ళ గ్రామానికి చెందినవారే కావడం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉండటం అందరినీ కలచివేసింది.

పల్నాడు జిల్లా ఇనుమళ్ళ గ్రామానికి చెందిన మందపాటి చంద్రశేఖర్ తన 12 ఏళ్ల కుమారుడు భవానీ శంకర్‌తో పాటు స్నేహితులు రామాంజనేయులు, షేక్ మీరావలి, శ్రీనుతో కలిసి శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు శుభకార్యానికి కారులో బయలుదేరారు. శనివారం సాయంత్రం ప్రయాణం ప్రారంభించిన వారు ఆదివారం తెల్లవారుజామున గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఉదయం 3.10 నుంచి 3.30 గంటల మధ్య విశాఖ జిల్లా ఆనందపురం మండలం సత్తారు జంక్షన్ వంతెన వద్దకు చేరుకున్న సమయంలో, వారి కారు ముందు వెళ్తున్న లారీని అనుసరిస్తోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కారు అదుపు తప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న చంద్రశేఖర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లముందే తన కుమారుడు, స్నేహితులను కోల్పోయిన చంద్రశేఖర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఘటనాస్థలాన్ని విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడికి అత్యుత్తమ వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Follow Us