TTD: గుడికో గోమాత.. దేశవ్యాప్తంగా ఆలయాలకు టీటీడీ ఆవులు! ఇప్పటివరకు ఎన్ని అందించారంటే!
మన పురాణాల్లో చెప్పినట్టుగా సకల దేవతాస్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టిటిడి ఈవో శ్యామల రావు అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి సందర్బంగా గో పూజ మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. పిండ మార్పిడి విధానము ద్వారా మేలు రకమైన దేశవాళీ గోజాతిని అభివృద్ధి చేసేందుకు టీటీడీ.. శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయంతో MOU చేసుకుందని.. ఇందులో భాగంగా ఇప్పటి వరకు పిండ మార్పిడి విధానంలో 47 మేలు రకమైన “సాహివాల్” జాతి దూడలు జన్మించినట్లు ఆయన తెలిపారు.

పిండ మార్పిడి విధానము ద్వారా మేలు రకమైన దేశవాళీ గోజాతిని టీటీడీ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయంతో MOU చేసుకున్న టీటీడీ ఇప్పటి వరకు పిండ మార్పిడి విధానంలో 47 మేలు రకమైన సాహివాల్ జాతి దూడలు జన్మించినట్లు టీటీడీ పేర్కొంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి సందర్బంగా గో పూజ మహోత్సవాలను టిటిడి వేడుకగా నిర్వహించింది. టీటీడీ గోశాలలో ఉన్న గజరాజులకు ముందుగా పండ్లు అందించిన ఈఓ శ్యామలరావు అనంతరం వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించారు. ఉత్తమమైన దేశవాళీ గోజాతి పరిరక్షణలో భాగంగా, ఇప్పటి వరకు 539 దేశవాళీ గోవులను దాతల సహకారంతో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలకు తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరో 500ల దేశవాళీ గిర్, కాంక్రేజ్, థార్పార్కర్, రెడ్ సింధీ తదితర ఆవులను దాతల సహకారంతో ఎస్వీ గోశాలకు తీసుకురానున్నట్లు చెప్పారు.
గోవుల సంరక్షణలో భక్తుల భాగస్వామ్యం.
భక్తుల భాగస్వామ్యంతో గోవులను రక్షించుకుందా మన్నారు టీటీడీ ఈవో శ్యామల రావు. వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతా స్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందా మన్నారు. భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన స్థానం ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మొత్తం 2,789 గోవులు ఉన్నాయని, అందులో 1827 ఆవులు, 962 ఎద్దులు, 7 ఏనుగులు, 5 గుర్రాలు ఉన్నట్లు ఈఓ తెలిపారు. ప్రతిరోజు తిరుమల, తిరుపతి, తిరుచానూరు గోశాలల్లో, అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ మందిరంలో గోపూజ నిర్వహించడం జరుగు తోందన్నారు. ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో పూజా కైంకర్యాల నిమిత్తం దేశవాళీ గోవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని గోశాల నుండి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దైవ కార్యక్రమాలకే కాకుండా టీటీడీ పరిధిలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు, చంటి బిడ్డలకు, వృద్ధులకు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు, క్యాంటీన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రత్యేకంగా పాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
గుడికో గోమాత.
టీటీడీ దేశవ్యాప్తంగా 195 ఆలయాలకు ఉచితంగా ఆవు, దూడలను అందించినట్లు తెలిపారు. అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాలలో గుడికో గోమాత పథకం ద్వారా గోశాల నుండి అందించిన గోమాతలకు భక్తులు నిత్యం గోపూజ నిర్వహిస్తున్నారన్నారు. గోశాలలో రూ.12.25 కోట్లతో ఎస్వీ పశుదాణా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇందులో గోశాలలలో ఉన్న దేశవాళీ గోవుల ఆరోగ్య పరిరక్షణ, అధిక పాల ఉత్పత్తికి అవసరమైన, నాణ్యమైన మేలురకపు సమతుల్య పశుదాణా ను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడం జరుగుతోందన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, నిర్వహణ, సంతానోత్పత్తి, సంక్షేమ కార్యకలాపాలపై విలువైన సలహాలు, సిఫార్సులు అందించేందుకు, టిటిడి గోశాలలో జరుగుతున్న సాధారణ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి గోశాల నిపుణులు కమిటీని ఏర్పాటు చేసామన్నారు టిటిడి ఈఓ శ్యామల రావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
