Snakes Hulchal: తిరుమలలో పాముల కలకలం.. భక్తులు హడల్.. మహాబూబ్‌నగర్ జిల్లాలో అయితే కుప్పలు తెప్పలుగా

తిరుమలలో మరోసారి పామలు హడలెత్తించాయి. మంగళవారం రెండు చోట్ల కనిపించిన పాములు స్థానికులతో పాటు భక్తులను కలవరపెట్టాయి. పాపవినాశనం మార్గంలోని కల్యాణవేదిక..

Snakes Hulchal: తిరుమలలో పాముల కలకలం.. భక్తులు హడల్.. మహాబూబ్‌నగర్ జిల్లాలో అయితే కుప్పలు తెప్పలుగా
Representative image

Updated on: Mar 17, 2021 | 7:16 PM

తిరుమలలో మరోసారి పామలు హడలెత్తించాయి. మంగళవారం రెండు చోట్ల కనిపించిన పాములు స్థానికులతో పాటు భక్తులను కలవరపెట్టాయి. పాపవినాశనం మార్గంలోని కల్యాణవేదిక వెనుకవైపు ఉన్న మరుగు ప్రాంతం నుంచి ఐదడుగుల నాగుపాము కల్యాణవేదిక వద్దకు వచ్చింది. పామును గమనించిన సిబ్బంది, భక్తులు ఆందోళనకు గురై.. భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. దీంతో పాములు పట్టే టీటీడీ ఉద్యోగి భాస్కర నాయుడికి అధికారులు వెంటనే సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా ప్రాంతానికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

మ్యూజియం దగ్గర్లో మరో జెర్రిగొడ్డు కనిపించింది.  ఐదున్నర అడుగుల పొడవున్న ఈ పామును చూసిన భక్తులు ఆందోళన చెందారు. వెంటనే సమాచారం అందుకున్న భాస్కర నాయుడు ఆ సర్పాన్ని కూడా పట్టుకున్నారు. పట్టుకున్న రెండు పాములను శేషాచలం అటవీ ప్రాంతంలోని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.

మహాబూబ్‌నగర్ జిల్లాలోనూ పాముల కలకలం…

సాధారణంగా ఒక పామును చూస్తేనే అమాంతం పరుగులు పెడతాం. అలాంటిది పదుల సంఖ్యలో పాములను కనిపిస్తే.? వింటేనే ఒళ్లుజలదరిస్తోంది కదా..! అవునండీ.. ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వగా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 పాము పిల్లలు బయటపడ్డాయి. వాటిని చూసిన జనాలు బెంబేలెత్తిపోయారు. వివరాల్లోకి వెళ్తే..

ఈ ఘటన మహాబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఓ మూడు కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసముంటున్నాయి. అందులోని ఓ గుడిసెలో చిన్న కుర్మన్న నివాసముంటున్నాడు. వీరి గుడిసెలో విపరీతమైన దుర్వాసన రావడం మొదలు కావడంతో మంగళవారం ఉదయాన్నే ఓ మూలాన మట్టిని తవ్వారు. ఇలా తవ్వారో.. లేదో.. ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటికి వచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలా మొత్తం 21 పాము పిల్లలు బయటికి రాగా.. వాటిని స్థానికులు కర్రలతో కొట్టి చంపారు. ఇదిలా ఉంటే ఇదే గుడిసెలో పది రోజుల క్రితం ఓ పెద్ద పామును సైతం చంపారట. ఏది ఏమైనా ఈ పాముల కారణంగా అక్కడ ఉన్న ఆరుగురు చిన్నారులకు ఎలాంటి అపాయం కాకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:

TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 20న నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ విడుదల

AP Corona Cases: ఏపీలో కరోనా స్వింగ్.. కొత్తగా 253 మందికి పాజిటివ్.. జిల్లాల వారీగా కేసుల వివరాలు