AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి ఆ కుటుంబం బలి.. కొడుకును కష్టపడి చదివిస్తే.. ఇదో కన్నీటి గాధ

చిత్తూరు జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్ భూతం జడలు విప్పింది. గంగాధర నెల్లూరులో ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాత అక్క ప్రాణాలు కోల్పోయారు.. బీటెక్ చదివిన దినేష్ అనే యువకుడి బెట్టింగ్ వ్యసనం కన్న తల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కబళించింది.

Andhra Pradesh: ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి ఆ కుటుంబం బలి.. కొడుకును కష్టపడి చదివిస్తే.. ఇదో కన్నీటి గాధ
Online Betting
Raju M P R
| Edited By: |

Updated on: Oct 06, 2024 | 8:46 AM

Share

చిత్తూరు జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్ భూతం జడలు విప్పింది. గంగాధర నెల్లూరులో ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాత అక్క ప్రాణాలు కోల్పోయారు.. బీటెక్ చదివిన దినేష్ అనే యువకుడి బెట్టింగ్ వ్యసనం కన్న తల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కబళించింది. గంగాధర నెల్లూరులో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. గంగాధర నెల్లూరులో రైతు కుటుంబానికి చెందిన నాగరాజ రెడ్డి, జయంతి లకు ఇద్దరు సంతానం.. ఒకరు సుజాత మరొకరు దినేష్. కూతురు సుజాతని ఎంబీఏ చదివించిన నాగరాజు రెడ్డి జయంతి దంపతులు.. దినేష్ ను బీటెక్ చేయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆన్ లైన్ బెట్టింగ్స్‌కు బానిసైన దినేష్… కుటుంబానికి ఆసరాగా ఉండాల్సింది.. పోయి చెడు వ్యసనానికి అలవాటుపడ్డాడు.. అది కాస్త.. కుటుంబం ఊపిరి తీసేలా మారింది.

బీటెక్ చదువు కోసం వెళ్లి గత కొద్ది కాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డ 23 ఏళ్ల దినేష్. భారీగా అప్పులు చేశాడు.. రూ. కోటి మేర అప్పులు అయ్యాయి.. ఇది గత కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారం.. అయినా మార్పు రాలేదు.. రూ. కోటి మేర ఆన్ లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకొని తల్లిదండ్రులను కష్టాల్లో పడేశాడు.. దీంతో దినేష్ చేసిన అప్పులను తీర్చడం కన్న తల్లిదండ్రుల వంతుగా మారింది.. అప్పుల భారం ఎక్కువ అవ్వడంతో కోటి రూపాయలకు ఆస్తిని అమ్మిన తండ్రి నాగరాజు రెడ్డి.. దినేష్ చేసిన అప్పులను తీర్చాడు. అయినా దినేష్ లో మాత్రం మార్పు రాలేదు. అంత జరిగినా ఆన్ లైన్ బెట్టింగ్ వ్యసనాన్ని వీడలేదు. ఇలా మరో రూ. 30 లక్షలు ఆన్ లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం అప్పులు చేస్తున్న దినేష్‌తో కుటుంబ సభ్యులు గొడవకు దిగారు.. దీంతో దినేష్ కొత్త స్కెచ్ వేశాడు. అందరూ చనిపోదామని ఒప్పించాడు.. దినేష్ తోపాటు తల్లి జయంతి, తండ్రి నాగరాజ రెడ్డి, అక్క సునీతలతోపాటు అందరూ చనిపోదామని అనుకున్నారు..

అనుకున్నట్లుగానే దినేష్ బయటకు వెళ్లి కూల్ డ్రింక్ ను, పురుగుల మందును తీసుకొచ్చి ఆ రెండు మిక్స్ చేశాడు. పురుగులు మందు కలిపిన కూల్ డ్రింక్ ను కన్న తల్లిదండ్రులకు, తోడబుట్టిన అక్కకు బలవంతంగా తాపించి తాను కూడా తాగాడు. పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే నలుగురు అస్వస్థతకు గురై అరుపులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నలుగురి పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ తల్లిదండ్రులు నాగరాజ రెడ్డి, జయంతి చనిపోయారు.. తాజాగా దినేష్ సోదరి సునీత కూడా మృతి చెందింది. వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దినేష్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గంగాధర నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా దినేష్ నిర్వాకంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తనువు చాలించడం సంచలనంగా మారింది. తాను చేసిన అప్పుల కోసం కుటుంబసభ్యులకు కూల్ డ్రింక్ లో పురుగులు మందు కలిపి తాపించిన దినేష్.. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.. ఇలా ఆన్ లైన్ బెట్టింగ్ ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తచేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us