AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?

తిరుమల శ్రీవారి లడ్డూను సామాజిక మాధ్యమాల్లో లైక్‌లు, షేర్ల కోసం ఉపయోగించిన వీడియో వైరల్ కావడంతో టీటీడీ విచారణకు ఆదేశించింది. పవిత్ర ప్రసాదం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రచారం వెనుక ఉద్దేశమేంటన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?
Tirupati Laddu
Siva Nagaraju
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 8:12 PM

Share

కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవారి లడ్డూ. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ప్రచారానికి వస్తువుగా మారుతోందా? లైకులు, వీక్షణలు, అనుచరుల కోసం పవిత్ర ప్రసాదాన్ని ఉపయోగిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి.. తన సామాజిక మాధ్యమ పోస్టును ఇష్టపడి, మరో 30 మందికి పంచుకున్న వ్యక్తికి 30 శ్రీవారి లడ్డూలు ఇస్తున్నట్టుగా వీడియోలో కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్‌ కావడంతో టీటీడీ దీనిపై విచారణకు ఆదేశించింది. టీటీడీ ప్రధాన నిఘా, భద్రతా అధికారి కేవీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వివరాలు పరిశీలిస్తున్నారు. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాత సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.

శ్రీవారి లడ్డూ సాధారణ తినుబండారం కాదు. స్వామివారి దర్శనం తర్వాత భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం. అందుకే దాని తయారీ, నిల్వ, విక్రయం, పంపిణీ మొత్తం టీటీడీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య, లడ్డూల విక్రయాలు, హుండీ కానుకల స్థాయి చూస్తే ఈ వ్యవస్థ ఎంత పెద్దదో అర్థమవుతుంది.

2026 ఆగస్టు లెక్కలు చూస్తే.. ఒక్క నెలలోనే 24,56,017 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.137.44 కోట్లు కానుకలు వచ్చాయి. 1.30 కోట్ల లడ్డూలు విక్రయించారు. 10.50 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. అంటే రోజుకు సగటున దాదాపు 79 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టే. హుండీ కానుకలను రోజువారీ సగటుకు తీసుకుంటే సుమారు రూ.4.43 కోట్లు. అయితే ఇది హుండీ ద్వారా వచ్చిన మొత్తం మాత్రమే.. టీటీడీకి వచ్చే మొత్తం ఆదాయం కాదు. ఆగస్టు 18న ఒక్కరోజే రూ.6.12 కోట్ల హుండీ కానుకలు వచ్చాయి. ఆగస్టు 16న అత్యధికంగా 97,014 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఇక లడ్డూ విక్రయాల పరిమాణం చూస్తే..

నెలలో 1.30 కోట్ల లడ్డూలంటే రోజుకు సగటున 4.19 లక్షల లడ్డూలు భక్తుల చేతికి చేరినట్టే. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఉదాహరణకు ఆగస్టు 15న 90,293 మంది దర్శనం చేసుకోగా 4.60 లక్షల లడ్డూలు విక్రయించారు. ఆగస్టు 16న 97,014 మంది దర్శనం చేసుకోగా 4.61 లక్షల లడ్డూలు విక్రయించారు.

ఇంత భారీ స్థాయిలో తయారై, లక్షలాది భక్తులకు చేరే ప్రసాదం విషయంలో చిన్న ఘటన కూడా పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకే లడ్డూ నాణ్యత, పవిత్రత, నిల్వ, పంపిణీ మాత్రమే కాదు.. దాని పేరుతో జరుగుతున్న ప్రచారంపైనా టీటీడీ నిఘా అవసరం.

ఇది ఒక్కరోజు వచ్చిన సమస్య కూడా కాదు. 2024లో లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అనంతరం దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. లడ్డూ తయారీలో ఉపయోగించే ముడిసరుకుపై అనుమానం వచ్చినా.. కోట్లాది మంది భక్తుల్లో ఆందోళన ఏర్పడుతుందని ఆ ఘటన చూపించింది.

ఫేక్ వీడియోలు…

ఇటీవల కూడా లడ్డూలో దారం కనిపించిందని ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో టీటీడీ స్పందించింది. ధృవీకరణ లేని వీడియోలను నమ్మొద్దని, వాటిని పంచుకోవద్దని భక్తులను హెచ్చరించింది. అంటే ఒకవైపు నిజానిజాలు తెలియని వీడియోలు వైరల్‌ అవుతుండగా.. మరోవైపు లడ్డూనే సామాజిక మాధ్యమాల ప్రచారానికి ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

లడ్డూ పేరు, తిరుమల గుర్తింపును వ్యాపార ప్రయోజనాలకు అనధికారికంగా ఉపయోగించిన సందర్భాల్లోనూ టీటీడీ గతంలో న్యాయపరమైన చర్యలకు దిగింది. ప్రసాదం పేరు, గుర్తింపు, ప్రతిష్ఠను ఎవరు పడితే వారు ఉపయోగించకుండా నియంత్రణ అవసరమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పుడు తాజా వీడియో వ్యవహారంలో అసలు దర్యాప్తు అంశాలు ఇవే. వీడియోలో కనిపిస్తున్న లడ్డూలు నిజంగా టీటీడీ ప్రసాదమేనా? వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఒక వ్యక్తికి 30 లడ్డూలు ఎందుకు ఇచ్చారు? లైక్‌లు, షేర్లకు లడ్డూలను ప్రోత్సాహకంగా ఉపయోగించడం వెనుక ఉద్దేశం ఏమిటి? టీటీడీ నిబంధనలను ఉల్లంఘించారా? మరెవరైనా ఈ ప్రచారంలో భాగమయ్యారా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీడియోలో కనిపించిన వ్యక్తులపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. దర్యాప్తు పూర్తయ్యే వరకు వారిని దోషులుగా నిర్ధారించలేం.

ఏం చేయాలి…

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా టీటీడీ కొన్ని కఠినమైన నియంత్రణలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రసాదాన్ని సామాజిక మాధ్యమాల ప్రచార వస్తువుగా ఉపయోగించడంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి. లడ్డూలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి వాటిని తిరిగి విక్రయించడం లేదా ప్రచారానికి ఉపయోగించడం వంటి వ్యవహారాలపై పర్యవేక్షణ పెంచాలి. తప్పుడు సమాచారం వైరల్‌ అయితే వెంటనే అధికారికంగా వాస్తవాలను వెల్లడించే ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలను కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి.

పవిత్ర ప్రసాదాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, మతభావాలను రెచ్చగొట్టడం లేదా తప్పుడు ప్రచారంతో ప్రజల్లో ఉద్రిక్తత సృష్టించడం వంటి అంశాలు దర్యాప్తులో తేలితే సంబంధిత నేర చట్టాల కింద చర్యలకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీటీడీ నిబంధనలను ఉల్లంఘించినవారిపై పరిపాలనా చర్యలు, అనధికారిక వ్యాపార వినియోగం ఉంటే మేధో సంపత్తి హక్కులు, భౌగోళిక గుర్తింపు వంటి చట్టపరమైన మార్గాల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ నిబంధన లేదా నేర విభాగం వర్తిస్తుందన్నది ఘటనలోని వాస్తవాలు, దర్యాప్తు ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది.

తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఆగస్టు లెక్కలే చెబుతున్నాయి. ఒక్క నెలలో 24.56 లక్షల మంది దర్శనం. 1.30 కోట్ల లడ్డూల విక్రయం. రూ.137.44 కోట్ల హుండీ కానుకలు. అంటే శ్రీవారి లడ్డూ చుట్టూ ఉన్న వ్యవస్థ కేవలం ప్రసాద పంపిణీ వ్యవస్థ కాదు. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడిన భారీ వ్యవస్థ అనేది నిజం.

చివరిగా…

అందుకే లడ్డూను లైకులు, వీక్షణలు, అనుచరుల కోసం చేసే ప్రచార వస్తువుగా మార్చడం కేవలం ఒక వీడియో వ్యవహారంగా చూడకూడదు. భక్తి పేరుతో కంటెంట్‌.. కంటెంట్‌ పేరుతో ప్రచారం.. ప్రచారం పేరుతో పవిత్ర ప్రసాదాన్ని ఉపయోగించే ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. శ్రీవారి లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీక. వైరల్‌ సంస్కృతికి ప్రచార వస్తువు కాదు.

కొండవీటి శివనాగరాజు

డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Follow Us