కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి
తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజు ఇవాళ ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది. నారాయణుడి లీలలు నవరస భరితాలు..
తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగో రోజు ఇవాళ ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనసేవ జరిగింది. నారాయణుడి లీలలు నవరస భరితాలు..ఎన్ని అవతారాలెత్తినా అవన్నీ దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ కోసమే..బ్రహ్మోత్సవాలు చెప్పేది కూడా ఇదే…స్వామి వారు తన కల్ప వృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చేది కూడా ఇందుకే.. కామితార్థ ప్రదాయినిగా కల్పవృక్షాన్ని మనం చెప్పుకుంటాం..పురాణా ఇతిహాసాలలో కూడా కల్పవృక్షానికి ఓ విశిష్ట స్థానం వుంది.. అలాంటి కల్పవృక్షాన్ని కూడా తన వాహనంగా చేసుకోగలిగిన శ్రీవారు భక్తులకు కొంగు బంగారమే…కోరినంత వరాలను గుప్పించే దేవుడే. ఆలయంలోని కళ్యాణోత్సవం మండపంలో శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై తలపాగ, జాటీతో నయనానందకరంగా కనిపించారు.. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా అధికారులు ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన సంగతి విదితమే. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారికి సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది.