AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చోరీ చేసిన ఇంట్లోనే మకాం వేసిన దొంగోడు. మందు, విందులతో ఎంజాయ్‌..! మూడు రోజుల తరువాత..

దొంగతనం చేసిన వ్యక్తి అదే ఇంట్లో సౌకర్యవంతంగా మకాం వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికులకు మేలుకొలుపు కావాలని, ఇంటిని ఖాళీగా వదిలేటప్పుడు తమకు తెలియజేయడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అంటున్నారు పోలీసులు.

చోరీ చేసిన ఇంట్లోనే మకాం వేసిన దొంగోడు. మందు, విందులతో ఎంజాయ్‌..! మూడు రోజుల తరువాత..
Thief Stays
Gamidi Koteswara Rao
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 02, 2025 | 12:50 PM

Share

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో జరిగిన ఒక విచిత్రమైన దొంగతనం సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణ అనే వ్యక్తి దొంగతనం కోసం బొబ్బిలిలో రెక్కీ నిర్వహించాడు. అలా రెక్కీ చేయగా ఇంట్లో ఎవరూ లేకుండా తాళం వేసిన సీర శ్రీనివాసరావు ఇల్లు అతని కంట పడింది. వెంటనే అదే రోజు రాత్రి ఆ ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంటి యజమాని ఊరెళ్లడంతో ఇల్లు ఖాళీగా ఉంది. లోపలికి వెళ్లిన కృష్ణ బీరువాలో ఉన్న వెండి వస్తువులను, ఇతర విలువైన సామాన్లను కాజేశాడు. అయితే సాధారణంగా దొంగతనం చేసిన వెంటనే దొంగలు పరారవుతారు. కానీ ఈ దొంగ మాత్రం వెంటనే పారిపోకుండా ఆ ఇంట్లోనే మకాం వేశాడు.

దొంగిలించిన వెండి వస్తువులను స్థానికంగా అమ్మి ఆ డబ్బులతో మద్యం కొనుగోలు చేసి తిరిగి వచ్చి ఆ ఇంట్లోనే మద్యపానం చేస్తూ మూడు రోజులు గడిపాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తిని అక్కడే రాత్రి నిద్ర పోతున్నాడు. అలా మూడు రోజులు గడిచిన తరువాత ఇంటికి తాళం లేకపోవడం, ఇంటి యజమానులు కూడా బయటకు రాకపోవడం గమనించిన స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటి యజమాని శ్రీనివాసరావుకి స్థానికులు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో నేను ఇంకా బొబ్బిలికి రాలేదని, ఇంట్లో ఎవరో దొంగలు పడి ఉంటారని చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా మద్యం మత్తులో నిద్రిస్తున్న దొంగ కృష్ణ కనిపించాడు. స్థానికులు మద్యం మత్తులో ఉన్న దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగతనం చేసిన వ్యక్తి అదే ఇంట్లో సౌకర్యవంతంగా మకాం వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికులకు మేలుకొలుపు కావాలని, ఇంటిని ఖాళీగా వదిలేటప్పుడు తమకు తెలియజేయడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..