
భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు..! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మే నెల రాకముందే.. తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది.. ఆదివారం కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.. కోస్తాలోని 45 మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని పేర్కొంది.. అంతేకాకుండా మరో 185 మండలాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలతోపాటు.. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎండల ప్రభావం ఉంటుందని పేర్కొంది.. నిన్న చాలాచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.. సోమవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది..
నిన్నటి ఉష్ణోగ్రతలు ఓసారి చూస్తే.. ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రకాశం జిల్లా దరిమడుగు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7 డిగ్రీలు ఉంటే.. కడప జిల్లా మద్దూరు, ఖాజీపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐతే.. రియల్ ఫీల్ మాత్రం ఇంకో 2 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
తెలంగాణలో కూడా రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఆదివారం సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే చాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..