Cheeramenu: గోదావరిలో అరుదుగా దొరికే చీరమేను.. రేటులో మాత్రం పులసతో పోటీ.. రుచి అయితే అదరహో
చీరలు, దోమతెరల్లాంటి వలలకు మాత్రమే చీరమేను చేప చిక్కుతుంది. గోదావరి రాజులు ఈ చేపను బాగా ఇష్టంగా తింటారు. రేటు కాస్త ఎక్కువే.
చీరమేను చేపల గురించి మీకు తెల్సా..? సన్నగా, తెల్లగా ఉంటాయి. సాధారణ వలల్లో ఇవి చిక్కవు అండోయ్. చీర లేదా దోమతెరలు మాదిరిగా ఉండే ప్రత్యేక వలల్లోనే పడతాయి ఇవి. యానాంలో ఈ చేపల లభ్యత ఎక్కువగా ఉంటుంది. చలికాలం ప్రారంభమైన 2, 3 వారాలు మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి. పులస మాదిరిగానే చీరమేను కూడా సీజనల్ ఫిష్ అనమాట. ఇంకో విశేషం ఏంటంటే.. చీరమేను కూడా పులసలాగానే గోదావరి జలాల్లోకి ఎదురీదుతూ వస్తుంది. దీంతో డిమాండ్ భారీగా ఉంటుంది. గోదావరి రాజులు ఈ చేపను ఇష్టంగా తింటారు. ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది.
మాములుగా అయితే.. చేపలను కేజీలెక్కన అమ్ముతారు. కానీ చీరమేను చేపలను మాత్రం గ్లాసు, సోల, తవ్వ, శేరు, కుంచె, బిందెలు, బకెట్ల లెక్కన అమ్ముతారు. శేరు అంటే సుమారు కేజీ అన్నమాట. శేరు చీరమేను విలువ 2500 నుంచి 3000 వేల రూపాయల మధ్య ఉంటుంది. ఇగురు పెట్టినా, చింత చిగురు, మామిడికాయ, గోంగూర కలిసి వండినా ఆ రుచి చెప్పతరమా అంటున్నారు గోదావరి వాసులు. ఇక ఈ చేపల్లో ప్రొటిన్లతో పాటు కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. చీరమేను తింటే బాలింతల్లో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని పెద్దలు చెబుతారు.
కాగా ఏడాదికి, ఏడాదికి గోదావరిలో ఈ చేపల లభ్యత తగ్గుతుందని స్థానిక జాలర్లు చెబుతున్నారు. ఫిష్ బాగా ఇష్టంగా తినేవారు ఎవరైనా ఉంటే.. ఈ సీజన్లో లభించే చీరమేను చేపలను కూడా ఒక పట్టు పట్టండి. రేటు మాత్రం కాస్త ఎక్కువేనండోయ్.
మరిన్ని ఏపీ వార్తల కోసం