AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వర్షాలు వస్తున్నాయి.

వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌.. ఈసారి నాలుగు రోజులు ముందుగానే వర్షాలు!
Weather
Balaraju Goud
|

Updated on: May 17, 2025 | 7:02 AM

Share

మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో మాల్దీవులు.. మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఐఎండీ శుభవార్తతో తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులులోకి మరింతగా ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఈసారి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వర్షాలు వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఉత్తర కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు వాతావరణశాఖ అధికారులు. మన్యం, అల్లూరి జిల్లా, ఏలూరులో వర్షాలు కురుస్తాయని.. బాపట్ల, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాబోయే మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్