Andhra Pradesh: 16వ శతాబ్దం నాటి ఆంజనేయస్వామి ఆలయం ధ్వంసం.. సీఎం చంద్రబాబు సీరియస్
అన్నమయ్య జిల్లాలో కొందరు గుర్తు తెలియని దుండగులు 16వ శతాబ్ధం నాటి పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానికులు నిత్యం పూజలు చేసే ఆ దేవాలయాన్ని రెండు రోజుల క్రితం దుండగులు నేలమట్టం చేసేందుకు యత్నించారు..
చిత్తూరు, అక్టోబర్ 16: అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కదిరి నాయిని కోట పంచాయతీలోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని రెండ్రోజుల క్రితం గుర్తుతెలియని దుండగులు చేతిలో ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనుగొండ అటవీ ప్రాంతంలో 16 వ శతాబ్దంలో నిర్మించిన రాయస్వామి ఆలయంపై సోమవారం రాత్రి దాడి జరిగినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో రాతిబండ పై చెక్కి ఉంచిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న ప్రాంతాన్ని 12 ఏళ్ల కిత్రం మొలకల చెరువు వాసి విద్యాసాగర్ నిర్మించారు.
అప్పట్నుంచి ఆలయంలో పూజలు కొనసాగుతుండగా రెండు రోజుల క్రితం ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. ఈ ఆలయాన్ని నేలమట్టం చేసేందుకు దుండగులు ఆలయగోడలకు రంద్రాలు పెట్టి, పేల్చే ప్రయత్నం చేసినట్లు స్థానికులు గుర్తించారు. పునాదులతో పాటు ఆలయాన్ని పెకిలించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం మొలకలచెరువు పీఎస్లో ఆర్ఎస్ఎస్, వీ హెచ్ పీ, బిజెపి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీనిపై మొలకల చెరువు పీఎస్లో కేసు నమోదైంది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించడంతో ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయం ధ్వంసం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.