
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. గురువారం అల్లూరి జిల్లా అడ్డతీగల, దేవిపట్నం, గంగవరం, రంపచోడవరం మండలాలు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
శ్రీకాకుళం జిల్లా 11, విజయనగరం 17, పార్వతీపురం మన్యం 9, అల్లూరి 6, కాకినాడ 2, కోనసీమ 5, తూర్పుగోదావరి 16, ఏలూరు 14, కృష్ణా 19,గుంటూరు 12, బాపట్ల15, పల్నాడు చిలకలూరిపేట మండలంలో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
శుక్రవారం 3మండలాల్లో తీవ్రవడగాల్పులు , 94 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం నంద్యాల ఆత్మకూరులో 40.9°C, ప్రకాశం కొనకనమిట్లలో 40°C, వైఎస్సార్ జిల్లా వేంపల్లి, కృష్ణా జిల్లా కంకిపాడు లో 39.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.