AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రహదారిపై విమానాల రన్‌వే… ఇప్పటికే తొలి ట్రయల్‌ రన్‌ సక్సెస్‌… ఎక్కడో తెలుసా..

ప్రకాశం, బాపట్లజిల్లాల్లోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మాణం చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడినుంచి విమానాలు, హెలికాప్టర్లు టేక్‌ఆఫ్‌ చేసేందుకు, నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..16వ నంబరు జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్‌ పాస్‌ వరకు..

రహదారిపై విమానాల రన్‌వే... ఇప్పటికే తొలి ట్రయల్‌ రన్‌ సక్సెస్‌... ఎక్కడో తెలుసా..
Prakasam District
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 13, 2024 | 7:58 PM

Share

అత్యవసర పరిస్థితులు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు, హఠాత్ పరిణామాల వేళ ప్రజలకు సహాయం అందించేందుకు. సత్వర సాయం అందించేందుకు.. వీలుగా అత్యవసర ఎయిర్ ప్యాడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది.. ఆయా సందర్భాల్లో రహదారులు, రైల్వే లైన్లు దెబ్బతిన్న సమయాల్లో, యుద్ధాల వంటి ఇతర అత్యవసర పరిస్థితుల్లో, ఆపదలో ఉన్న ప్రజల తరలింపు సహాయక చర్యల కోసం వీటిని ముఖ్య రహదారులపై నిర్మించారు. దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయగా జాతీయ రహదారులపై 11. రాష్ట్ర రహదారులపై మిగిలిన 8 రూపుదిద్దుకున్నాయి… ఒక్కో రన్‌వే కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు…

సామాన్యులకు విమానాశ్రయాల సందర్శన నెరవేరని కలే.. దగ్గర నుంచి విమానం చూడాలంటే విమానాశ్రయానికి వెళ్ళాల్సిందే… అలా కాకుండా విమానం చూడాలంటే ఎప్పుడైనా అది ఆకాశంలో వెళ్తున్పప్పుడు మాత్రమే… అయితే ఇప్పుడు బాపట్లజిల్లా కొరిశెపాడు దగ్గర 16వ నెంబర్‌ జాతీయ జాతియ రహదారిపై గ్రామాల పక్కనే విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ కోసం సన్నాహాలు చేస్తుండటమే ఇప్పుడు ఆసక్తిగా మారింది..

ప్రకాశం, బాపట్లజిల్లాల్లోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మాణం చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడినుంచి విమానాలు, హెలికాప్టర్లు టేక్‌ఆఫ్‌ చేసేందుకు, నడిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి..16వ నంబరు జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్‌ పాస్‌ వరకు.. అలాగే బాపట్లజిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి.. దీనికి సంబంధించి రెండు ప్రముఖ సంస్థలు తమ పనులు పూర్తి చేశాయి.. ఈరెండు రోడ్‌ కం రన్‌వేలలో తొలుత బాపట్లజిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు ఉన్న రన్‌వేపై 2022 డిసెంబర్‌ 28వ తేదిన తొలి ట్రయల్‌ రన్‌ విజయవంతంగా చేశారు.. మొత్తం 5 విమానాలు ఇక్కడ లాండింగ్‌, పార్కింగ్ చేయడం కోసం తక్కువ ఎత్తులో ఎగురుతూ పరీక్షించాయి.. ల్యాండింగ్‌ కోసం అన్ని విధాలా అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్నారు.. ఈ 5 విమానాల్లో ఒకటి కార్గో విమానం కాగా మరో నాలుగు జెట్‌ ఫైటర్లు ఉన్నాయి.

ఇలా ఏర్పాటు…

16వ నెంబర్‌ జాతీయ రహదారిపై సింగరాయకొండ, కొరిశెపాడు దగ్గర రెండు ప్రాంతాల్లో నిర్దేశిత ప్రాంతం నుంచి 3.5 నుంచి 4కిలోమీటర్ల పరిధిలో అత్యవసర ఎయిర్ ప్యాడ్లను నిర్మించారు…విమానాలు ల్యాండింగ్‌ కోసం 4 కిలోమీటర్ల మేర రన్‌వేను దృఢంగా , సౌకర్యవంతంగా నిర్మిణాలు పూర్తి చేశారు… జాతీయ రహదారిపై 60 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేశారు.. వీటిని నిర్మించే ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ తో పాటు రోడ్డు, విద్యుత్ స్తంభాలు, బస్‌ బే, చెట్లను తొలగించారు… రన్‌వేకు ఆనుకుని ప్రధాన రహదారిపై విమానాల పార్కింగ్ స్లాట్స్ నిర్మించారు… అందుకోసం రహదారిని రెండువైపులా విస్తరించి ఇతర వాహనాలను ఆ మార్గంలో మళ్లిస్తారు..

బాపట్లజిల్లా కొరిశెపాడు దగ్గర రన్‌వే కోసం 80 కోట్లు ఖర్చు చేశారు… అలాగే ప్రకాశంజిల్లా సింగరాయకొండ దగ్గర రన్‌వే కోసం కూడా మరో 80 కోట్లు వెచ్చించారు… జాతీయ రహదారిపై ఈ రన్‌వేలు నిర్మించకముందు తారురోడ్డు ఉండేది… ఈ తారు రోడ్డును తొలగించి 6 అడుగుల మేర గుంతలు తవ్వారు… ఆ గోతుల్లో నాలుగు పొరలుగా ఇసుక, కంకర, సిమెంట్‌తో మెటల్‌ రోడ్డు వేశారు… దానిపై తిరిగి సిమెంట్‌ రోడ్డు నిర్మించారు.

రాష్ట్రంలో రెండు రన్‌వేలు…

రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర 16వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిపైనే రెండు అత్యవసర విమానం ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించారు… ఈ రహదారి వెంబడి విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలు ఉన్నాయి… ఈ రహదారికి కొద్దిదూరంలోనే రేణిగుంట విమానాశ్రయం కూడా ఉంది… అయితే గన్నవరం, రేణిగుంట….ఈ రెండింటి మధ్య మరెక్కడా విమానాశ్రయాలు లేవు… నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న విమానాశ్రయం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఈ మార్గంలో ఎక్కడైనా, ఏదైనా, అత్యవసర పరిస్థితి ఏర్పడినా…. ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అత్యవసర ల్యాండింగ్ ఎయిర్ ప్యాడ్లకు ఒంగోలుకు దక్షిణ ప్రాంతంలో ఒకటి, ఉత్తర ప్రాంతంలో మరోకటి నిర్మించారు… వీటిలో దక్షిణంవైపు ప్రకాశంజిల్లా సింగరాయకొండ పరిధిలోని కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్‌పాస్‌ వరకు నిర్మించగా మరొకటి ఉత్తరంవైపు బాపట్లజిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు నిర్మించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న బాపట్లజిల్లా కొరిశెపాడులో 2022 డిసెంబర్‌ 28న మొదటి ట్రయల్‌ రన్‌ ను ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ, ఇండియన్‌ ఏయిర్‌ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా పూర్తి చేశారు… రెండో ట్రయల్‌ రన్‌ను మరో వారం రోజుల్లోపు చేయాలని నిర్ణయించారు… ఈనెల 19న ఈ ట్రయల్‌ రన్‌ ఉండే అవకాశం ఉంది… ఈ రెండో ట్రయల్‌ రన్‌ను వీక్షించేందుకు స్వయంగా ప్రధాని మోడీ హాజరవుతారని భావిస్తున్నారు… అందుకోసం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి తేదినీ ఖరారు చేస్తూ అనుమతి రావాల్సి ఉంది… ప్రధాని మోడీ రెండో ట్రయల్‌ రన్‌ కోసం వస్తున్నారా… లేదా… వస్తే, ఏ తేదిన వస్తారు అన్న దానిపై క్లారిటీ మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us