అనంతపురం టు హైదరాబాద్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి నిద్రపోయాడు.. మెలుకువరాగానే..
అనంతపురం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న బంగారం వ్యాపారికి భారీ షాక్ తగిలింది. దాదాపు రూ.4 కోట్ల విలువైన 2.75 కిలోల బంగారం చోరీకి గురైంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారి మోతీలాల్ అనంతపురం, ధర్మవరం ప్రాంతాల్లో వ్యాపారం ముగించుకుని సహాయకుడితో కలిసి మీనా ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. డోన్ సమీపంలోని భారత్ డాబా వద్ద బస్సు ఆగిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారం ఉన్న బ్యాగ్ను అపహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న కొత్తపల్లి గ్రామ సమీపంలోని భారత్ డాబా హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు 2.75 కేజీల బంగారాన్ని చోరీచేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్కు చెందిన మోతిలాల్ అనే బంగారం వ్యాపారి శుక్రవారం అనంతపురం, ధర్మవరం పట్టణాలలో షాపులకు తిరిగి బంగారం విక్రయించి తిరుగు ప్రయాణమయ్యాడు. తన వద్ద అమ్ముడు పోగా మిగిలిన 2.75 కిలోల బంగారం తన వద్ద ఉంది. దాదాపు నాలుగు కోట్ల విలువ చేసే బంగారాన్ని తీసుకొని ఒక సహాయకుడితో కలిసి రాత్రి 10 గంటలకు మీనా ట్రావెల్స్ బస్సులో అనంతపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరాడు. ఆ తర్వాత నిద్రపోయాడు..
తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జడ్చర్ల సమీపంలో బస్సు వెళుతుండగా బంగారు నగలు ఉన్న బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు అప్రమత్తమయ్యారు. డ్రైవర్ను బస్సు ఎక్కడెక్కడ ఆగింది.. ఎక్కడైనా వ్యక్తులు దిగిపోయారా అని అడగగా.. రాత్రి 12 గంటల సమయంలో డోన్ సమీపంలోని భారత దాబా వద్ద బస్సు ఆపినట్లు డ్రైవర్ చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు దిగిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో బాధితుడు మోతిలాల్ శనివారం ఉదయం డోన్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో చూడండి..
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బస్సు వెనుక ఒక తెల్లటి స్కార్పియో వాహనంలో కొందరు ఫాలో అయ్యి డాబా వద్ద బస్సు ఆగినప్పుడు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు, టోల్గేట్ల వద్ద బస్సు వెనుక ఫాలో అవుతున్న స్కార్పియో వాహనం ఆచూకీతోపాటు.. బస్సులోని ప్రయాణికుల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తానికి చోరీకి గురైన బంగారం ఆచూకీ లభిస్తుందా లేదా అనేదానిపై బాధితులలో ఆందోళన నెలకొంది. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
