ఏపీ నుంచి ఎంపికయ్యే కేంద్ర మంత్రులు ఎవరన్నదానిపై స్పష్టత వచ్చింది. గత రెండు రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఈ జాబితాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేబినెట్లో చోటు దక్కింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నలుగురికి కేంద్రమంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రమంత్రివర్గ కూర్పుపై దాదాపు 9 గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్తో చర్చించారు. మిత్రపక్షాల్లో ఎవరికెన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. మిత్రపక్షాలకు కేబినెట్ బెర్త్ ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ ఓ ఫార్ములాని వర్కౌట్ చేశారు. 5 కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు. రెండు, మూడు ఎంపీలు ఉన్నవారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది. దీని ప్రకారం.. తెలుగుదేశం, జేడీయూ, శివసేన -షిండే వర్గం, లోక్ జనశక్తి – పాశ్వాన్ పార్టీలకు కేబినెట్ పదవులు వరించబోతున్నాయి. అలాగే మిత్రపక్షాల్లో భాగస్వామ్యమైన కుమారస్వామి, ప్రతాప్ జాదవ్ కు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయి. అలాగే నితిన్ గడ్కరీ, శర్బానంద సోనోవాల్, మేఘ్ వాల్, జితేందర్ సింగ్ లకు కూడా ఫోన్ చేసినట్లు సమాచారం. వీరందరు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఎవరికి ఏ శాఖలు వరించాయన్న దానిపై స్పష్టత రావల్సి ఉంది.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జూన్ 9 శుక్రవారం సాయంత్రం 7.15కు ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 30మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన రామోజీ రావు పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆయన అంత్యక్రియలు పూర్తైన తరువాత నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోదీ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథులు అందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం మాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు.. మారిషస్ ప్రెసిడెంట్ ప్రవింద్ జుగ్నౌథ్ కూడా ఢిల్లీకి వచ్చారు. భారత సంప్రదాయం ప్రకారం వీరికి స్వాగతం పలికారు. సాయంత్రం ప్రధాని ప్రమాణస్వీకారంలో వీరు పాల్గొంటారు. ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ నేతలకు నివాళి అర్పించారు. ముందుగా రాజ్ఘాట్ను సందర్శించి.. మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ నుంచి అటల్ సదైవ్కు వెళ్లారు మోదీ. మాజీ ప్రధాని వాజ్పేయికి మోదీ నివాళులు అర్పించారు. అటల్ సదైవ్ నుంచి నేరుగా.. నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లారు. అమరజవాన్లకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, త్రివిద దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..