NTR 25th Death Anniversary: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు, యువ పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తాను ఎప్పుడు నిరుత్సాహంతో ఉన్నా.. ఎన్టీఆర్ పిలిస్తే చాలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందని పేర్కొన్నారు.
ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. వెండితెరపై ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ ఎన్నో చేశారని.. ట్రెండ్ సెట్టర్గా.. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా ఆయన ఎదిగారని బాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో పాటు సంక్షేమ పాలనతోనూ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని బాలకృష్ణ అన్నారు. తెలుగువాళ్లను మద్రాసియులు అని పిలవబడుతున్న సమయంలో తెలుగుజాతి గొంతు ఎత్తి చాటిన మహనీయులు ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో ఎన్టీఆర్ వెలుగులు నింపారని అన్నారు. ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా.. ఆయన కీర్తి మాత్రం ఎల్లప్పుడూ మన ముందే ఉంటుందని బాలకృష్ణ పేర్కొన్నారు.