
తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నుంచి తరచుగా బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీల ప్రాంతంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వేదిక్ యూనివర్సిటీ, ఎస్.వి. యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతల సంచారం ఎక్కువ కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వర్సిటీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న ఈ చిరుతలు అలిపిరి జూపార్క్ రోడ్డును క్రాస్ చేసి యూనివర్సిటీల లోపలికి ప్రవేశిస్తున్నాయి. సాధారణంగా కుక్కల్ని వేటాడేందుకు వస్తున్న చిరుతలు ఇప్పుడు ఏ చిన్న జంతువు కనిపించినా వేటాడే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎస్.వి. యూనివర్సిటీలోకి వచ్చిన చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి
చిరుత యూనివర్సిటీలోని ఉద్యోగుల క్వార్టర్స్ దగ్గర ఉన్న ఒక నాటుకోళ్ల షెడ్ వద్ద సంచరించింది. కోళ్ల శబ్దం వినిపించడంతో వాటిని వేటాడే ప్రయత్నంలో షెడ్ చుట్టూ తిరిగింది. ఈ అలజడి మొత్తం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయింది. ఈ సీసీ ఫుటేజీని వర్సిటీ సిబ్బంది వెంటనే అటవీ అధికారులకు పంపించి సమాచారం అందించారు. తరచూ యూనివర్సిటీలోని పలు ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండటంతో అసలు ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో స్పష్టంగా తెలియక విద్యార్థులు, ఉద్యోగులు, వర్సిటీ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతల నుంచి తమ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.