Andhra Pradesh: ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1.50లక్షలు.. ఆ రెండు పథకాలు శనివారం నుంచే అమలు..
ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకం అమలు ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలు తీసుకురావాలని నిర్ణయించింది...
ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకం అమలు ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వం.. మరో రెండు పథకాలు తీసుకురావాలని నిర్ణయించింది. వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం జగన్ శనివారం (అక్టోబర్ 1)న ప్రారంభించనున్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ.1.2 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, బీసీలకు రూ.50 వేలు, షాదీ తోఫాలో ముస్లిం, మైనార్టీలకు రూ.లక్ష, వికలాంగుల వివాహానికి రూ.1.5 లక్షలు అందించనున్నారు. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశామని నేతలు వెల్లడించారు.
ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచారశాఖ కమిషనరు టి విజయకుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకానికి అర్హులు.. అమ్మాయి వయసు 18,అబ్బాయి వయసు 21 ఏళ్లు కచ్చితంగా నిండాలి. గ్రామాల్లో ఆదాయం నెలకు రూ. 10 వేలు పట్టణాల్లో అయితే నెలకు రూ 12 వేలకు మించకూడదు. వారి ఇళ్ళలో నెలవారి విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటకూడదు. కుటుంబంలో ఇన్ కమ్ టాక్స్ పేయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. దీంతో.. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి 6 దశల్లో తనిఖీలు ఉంటాయని సమచారం. వధూవరులు ఇద్దరి కుటుంబ సభ్యుల వివరాలను పరిగణలోకి తీసుకుంటారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు రూ. లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 1.20లక్షలు ఇస్తారు. బీసీలకు రూ. 50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే రూ. 75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు రూ. లక్ష, దివ్యాంగులైతే రూ. 1.50లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు రూ. 40వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది.
మరోవైపు.. రాష్ట్రంలోని గ్రేడ్–1, 2 వీఆర్వోలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ వీఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం జగన్ సర్కార్ వీరి డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని వీఆర్వోల సుదీర్ఘ కాల డిమాండ్ను నెరవేర్చింది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం