కోనసీమ అందాలు ఇక కనుమరుగేనా..? పచ్చని తోటలు చచ్చుబడిపోతున్నాయి..! కారణం ఏంటంటే..

|

Nov 14, 2022 | 4:49 PM

గత రెండేళ్లుగా ఇక్కడి రైతులు...జిల్లా కలెక్టర్ అధికారుల చుట్టూ కాళ్లు అరిగి పోయేలా తిరిగినా... ఫలితం లేదని వాపోతున్నారు బాధిత రైతులు.

కోనసీమ అందాలు ఇక కనుమరుగేనా..? పచ్చని తోటలు చచ్చుబడిపోతున్నాయి..! కారణం ఏంటంటే..
Konaseema
Follow us on

కోనసీమ అంటేనే భూతల స్వర్గం. ప్రకృతి రమణీయతకు పట్టిన అద్దం..కొనసీమ అనగనానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆకు పచ్చ రంగు పులుముకున్న ప్రకృతి సోయగం. ఎత్తైన కొబ్బరి తోటలు.., సముద్ర తీరం.. గోదావరి నదీపరివాహక ప్రాంతం ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తుంది. అలాంటి కొనసీమకు ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. అందమైన సీమకు ఆపద ముంచుకొచ్చింది. కోనసీమలోని పచ్చటి కొబ్బరితోటల్లో ఉప్పునీరు నిప్పు రాజేస్తోంది. దాదాపు పది గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో కొబ్బరిచెట్లు నిట్టనిలువునా మోడువారిపోతున్నాయి. ఒక్కటో రెండో కాదు మొత్తం 25000 కొబ్బరి చెట్లు ఉన్నఫళంగా ఎండిపోవడంతో కొబ్బరి రైతులు ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ లబోదిబోమంటున్నారు. పది గ్రామాల సర్పంచులు తమ గోడు వినండంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. పది గ్రామాల రైతులు, సర్పంచులు కొబ్బరితోటల్లోనే నిరసనకు దిగారు.

కొబ్బరితోటలతో నిత్యం కళకళలాడే కోనసీమ మోడుబారిపోయింది. మలికుపురం మండలంలోని శంకర్ గుప్తం డ్రైన్ అనుకుని ఇరువైపుల ఉన్న 10 గ్రామాల కొబ్బరి తోటలకు డ్రైన్ ద్వారా వెళ్ళే ఉప్పు నీరు పెను ముప్పులా మారింది. సముద్రం ఆటు పొటులకు సముద్రపునీరు పొంగి కొబ్బరి తోటలను ముంచెత్తుతోంది. దీంతో సుమారు 2500 ఎకరాల్లోని 25,000 కొబ్బరి చెట్లు ఆకులు రాలిపోయి, మోడుల్లా తయారయ్యాయి. దీంతో లబోదిబో మంటున్నారు కొబ్బరి రైతులు.

ప్రతియేటా 30 నుంచి 40 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే తోటలు ఎండిపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతీ నెలా కొబ్బరి పైన ఆధారపడి బతికే రైతులు గత రెండేళ్లుగా ఒక్క కొబ్బరి కాయ కూడా లేకపోవడంతో ఎం చేయలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనికి తోడు కొబ్బరిపైన ఆధారపడి బతికే ఎందరో కూలీలు తిండికి కూడా లేక అల్లాడుతోన్న స్థితి ఆందోళనకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

గత రెండేళ్లుగా ఇక్కడి రైతులు…జిల్లా కలెక్టర్ అధికారుల చుట్టూ కాళ్లు అరిగి పోయేలా తిరిగినా… ఫలితం లేదని వాపోతున్నారు బాధిత రైతులు. శంకర్ గుప్తా డ్రైన్ గట్టుని పటిష్టపరిచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు. తినడానికి తిండిసైతం కరువైన రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొత్తగా వేసుకున్న కొబ్బరిమొక్కలు పంటకొచ్చే వరకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి