
వర్షాలపై తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. జూన్ 27వ తేదీ నుంచి జులై 2 వరకు భారీ వర్షసూచన జారీ చేసింది. గంటలకు 30 నుకంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ద్రోణితో పాటు నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో.. వీటి ప్రభావంతో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది.
నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ సహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. జూన్ 29 వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలకు పడతాయని హెచ్చరించారు. జూన్ 30 నుంచి జూలై 1 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలుకు ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది.
అటు ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు కురుస్తుండగా.. శనివారం కూడా పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా అమరావతి వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఉత్తరాంధ్ర, కోనసీమ, నెల్లూరులో పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఇక జూన్ 28వ తేదీన గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.