
అది లక్షల విలువ చేసే మద్యం.. అయితే.. ఆ మద్యం మొత్తం అక్రమంగా తరలిస్తూ పట్టుబడిందే.. ఇలా భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తోందెవరు..? పోలీసుల నిఘా ఉన్నప్పటికీ.. మద్యం బాటిళ్లను ఎలా తరలిస్తున్నారు..? మద్యం ఏరులై పారుతుండటంతో ఎస్ఈబీ అధికారులు నిఘా పెంచారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అక్రమంగా తరలిస్తోన్న మద్యం బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆ మద్యం బాటిళ్ల విలువ సుమారు 6 లక్షలకు పైగా ఉంటుందని ఎస్ఈబీ సీఐ శ్రీనివాస్ తెలిపారు. సుమారు 6 వేలకు పైగా మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. గత కొంత కాలంగా ఏపీలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. మద్యం అక్రమ రవాణాపై అధికారుల నిఘా ఉన్నప్పటికీ.. పలు రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకుని వచ్చి విక్రయాలు చేపడుతుండటం పరిపాటిగా మారింది. దీంతో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సైతం తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో తరచుగా భారీ మొత్తంలో మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి.
తాజాగా జగ్గయ్యపేట ఎస్ఈబీ కార్యాలయం పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లను సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ ఘటనను చూసిన మద్యం బాబులు.. తమకు ఎంతో ప్రీతిపాత్రమైన మద్యం నేలపాలైందంటూ బాధపడుతున్నారు. తమకు ఇష్టమైన మద్యం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడని మందుబాబులు.. ఇలా మద్యం బాటిళ్లు నేల పాలవడం చూసి తట్టుకోలేకపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..