Janasena: ఇష్టమున్నా లేకపోయినా.. చచ్చేవరకు పవన్ కల్యాణ్‌తోనే ఉంటాః హరిరామ జోగయ్య

గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్న హరిరామజోగయ్య మరోసారి బాంబు పేల్చారు. ఈసారి పవన్‌కు రెండు పేజీల భారీ లేఖను రాసిన హరిరామజోగయ్య.. కొందరు కావాలనే ఇద్దరి మధ్య తగువులు పెడుతున్నారని ఆరోపించారు. జనసేన బాగుకోసం సూచనలిస్తుంటే, తట్టుకోలేని కొందరు నేతలు, తనను వైసీపీ కోవర్ట్‌ అంటారా? అని మండిపడ్డారు

Janasena: ఇష్టమున్నా లేకపోయినా.. చచ్చేవరకు పవన్ కల్యాణ్‌తోనే ఉంటాః హరిరామ జోగయ్య
Pawan Kalyan Harirama Jogaiah
Follow us

|

Updated on: Mar 01, 2024 | 1:26 PM

గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్న హరిరామజోగయ్య మరోసారి బాంబు పేల్చారు. ఈసారి పవన్‌కు రెండు పేజీల భారీ లేఖను రాసిన హరిరామజోగయ్య.. కొందరు కావాలనే ఇద్దరి మధ్య తగువులు పెడుతున్నారని ఆరోపించారు. జనసేన బాగుకోసం సూచనలిస్తుంటే, తట్టుకోలేని కొందరు నేతలు, తనను వైసీపీ కోవర్ట్‌ అంటారా? అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పా? అని జోగయ్య ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనసేనకు మంచి ఆదరణ లభిస్తోందని. మరీ ముఖ్యంగా 40 స్థానాల్లో బలం ఉంటే 24 సీట్లే తీసుకోవడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. దుర్బుద్ధితోనే తెలుగుదేశం పార్టీ తక్కువ సీట్లు ఇచ్చిందని కార్యకర్తలు అనుకుంటున్నారని హరిరామ జోగయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సహకారం లేకుండా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గెలవడం అసాధ్యమన్నారు. అందుకే, జనసేనతో చంద్రబాబు జతకట్టారన్నారు జోగయ్య. నిజమైన మిత్రులెవరో.. శత్రువులెవరో తెలుసుకోవాలని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు జోగయ్య.

తాజాగా పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు హరిరామ జోగయ్య. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, జనసేనను నిర్వీర్యం చేస్తారని జోగయ్య జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తే పవన్‌ స్థానం ఏంటని అడగడం తప్పా? అన్నారు. చంద్రబాబుకు మీరు దాసోహమైనట్టుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఇష్టమున్నా లేకపోయినా చచ్చేవరకు పవన్ కల్యాణ్‌తోనే ఉంటానని జోగయ్య స్పష్టం చేశారు.

అంతేకాదు మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేయాలన్నా టీడీపీ పొలిట్‌బ్యూరో అనుమతి కావాలని లోకేష్‌ అనడం ఎంతవరకు కరెక్ట్‌? అని ప్రశ్నించారు. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ రాకుండా అడ్డుపడుతున్నదీ చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీని ఓడించాలంటే బీజేపీని కూడా కూటమిలో ఉండాలని జోగయ్య సూచించారు.

అంతకుముందు హరిరామజోగయ్య ఇదే రకమైన లేఖను విడుదల చేశారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు దక్కిన సీట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటని.. పార్టీ పరిస్ధితి అంత దయనీయంగా ఉందా అని ప్రశ్నించారు. జనసేన శక్తిని పవన్ తక్కువగా అంచనా వేసుకుంటున్నారని కామెంట్ చేశారు. 24 సీట్ల కేటాయింపు జనసైనికులను సంతృప్తి పరచలేదని.. రాజ్యాధికారంలో వాళ్లు జనసేన వాటా కోరుకుంటున్నారని చెప్పారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని ఆరోపించారు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…