AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు దశాబ్దాల ప్రజాసేవ చేసిన ఉద్యోగికి చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు..

మూడు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగి సిరా రామారావుకు మరణానంతరం చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు. అద్దె ఇంటి యజమాని భౌతికకాయాన్ని ఇంటి ముందు ఉంచేందుకు అనుమతించకపోవడంతో, రోడ్డుపైనే నివాళులర్పించి అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చిన ఘటన కంకిపాడులో తీవ్ర విషాదాన్ని నింపింది.

మూడు దశాబ్దాల ప్రజాసేవ చేసిన ఉద్యోగికి చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కలేదు..
Final Farewell
M Sivakumar
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 12:13 PM

Share

ప్రభుత్వ ఉద్యోగిగా మూడు దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించిన ఓ ఉద్యోగికి, మరణానంతరం చివరి వీడ్కోలు కూడా ఇంటి గడప వద్ద దక్కని విషాద ఘటన కృష్ణా జిల్లా కంకిపాడులో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ సిరా రామారావు భౌతికకాయాన్ని అద్దె ఇంటి ముందు ఉంచేందుకు ఇంటి యజమాని అనుమతించకపోవడంతో, చివరకు రోడ్డుపైనే నివాళులర్పించి అంత్యక్రియలకు తరలించాల్సి వచ్చింది.

సిరా రామారావు సుమారు 30 ఏళ్ల పాటు పంచాయతీ శాఖలో విధులు నిర్వహించారు. పామర్రు, కైకలూరు, తిరువూరు ప్రాంతాల్లో సేవలందించిన ఆయన, గత నాలుగేళ్లుగా కంకిపాడు పంచాయతీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పదోన్నతి పొంది కంకిపాడు మండలంలోని వేల్పూరు గ్రామ కార్యదర్శి (ఈవో)గా నియమితులయ్యారు. మరో మూడు నుంచి నాలుగు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

శుక్రవారం పోస్టుమార్టం అనంతరం రామారావు భౌతికకాయాన్ని కంకిపాడులోని ఆయన నివాసమైన అద్దె ఇంటికి తీసుకొచ్చారు. బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు చివరిసారిగా ఇంటి ముందు భౌతికకాయాన్ని ఉంచి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఇంటి యజమాని అందుకు అనుమతి నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అక్కడ తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

ఏం చేయాలో అర్థంకాక కుటుంబ సభ్యులు, బంధువులు కొంతసేపు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పంచాయతీ అధికారులు, సహోద్యోగులు కలిసి సమీపంలోని ఓ మిత్రుడి ఖాళీ స్థలంలో రోడ్డుపైనే భౌతికకాయాన్ని ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుంచే అంతిమయాత్ర ప్రారంభమైంది.

ప్రజల కోసం జీవితాంతం సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగికి, మరణానంతరం కనీసం చివరి వీడ్కోలు చెప్పేందుకు కూడా ఇంటి గడప దక్కకపోవడం స్థానికులను కలచివేసింది. బతికున్నప్పుడు సొంత ఇల్లు లేకపోవడం ఒక బాధ అయితే, మరణించిన తర్వాత కూడా చివరిసారిగా ఇంటి ముందు భౌతికకాయాన్ని ఉంచే అవకాశం లేకపోవడం మరింత బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

రామారావు భౌతికకాయానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇన్‌చార్జి ఎంపీడీవో బసవయ్య, ఈవో రాజేంద్ర వరప్రసాద్, పంచాయతీ సిబ్బంది సూర్య, అజయ్ సుబ్రహ్మణ్యం తదితరులు కూడా నివాళులర్పించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us