
కడప జిల్లాలో రెండో బొంబాయిగా పిలిచే ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిరోజు వందల కోట్ల రూపాయల బంగారం వ్యాపారం ఇక్కడ టర్న్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నిన్న రాత్రి ఓ బంగారు వ్యాపారిని కొంతమంది దుండగులు పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. తనికంటి జ్యువెలర్స్ నడుపుతున్న శ్రీనివాసులు, అతని భార్య లక్ష్మితో కలిసి నిన్న టూవీలర్పై నిన్న రాత్రి ఇంటికి బయలుదేరారు. షాప్ కట్టేసి ఇంటికి వెళుతున్న భార్యాభర్తలను ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో ఓ కారులో వచ్చిన దుండగులు అడ్డగించి మేము పోలీసులు అని చెప్పి శ్రీనివాసులను బలవంతంగా కారులో ఎక్కించుకొని దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి కలవండి అంటూ వెళ్లిపోయారు. ఆచూకీ కోసం ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన భార్య లక్ష్మికి అక్కడ చేదు అనుభవం ఎదురయింది.
ఇక్కడి వారెవరూ నీ భర్తను అరెస్ట్ చేయలేదని పోలీసులు.. ఆమెకు చెప్పడంతో ఆమె అవాక్కయింది. అయితే ఆ పోలీస్ స్టేషన్లోనే శ్రీలక్ష్మి భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకు వెళ్లారని ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతకాలంటూ పోలీసులను వేడుకోగా.. అక్కడ పోలీసులు చెప్పిన సమాధానానికి ఆమె అవాక్కయింది. ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలు ఉన్నాయి గానీ.. అవి పని చేయడం లేదంటూ పోలీసులు తాపీగా చెప్పడంతో బాధితురాలికి ఏం చేయాలో పాలుపోలేదు. నా భర్తను వెతికి పెట్టండి మహా ప్రభూ అంటూ పోలీసులను వేడుకుంది.
భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కు వచ్చిన అభాగ్యురాలి ఫిర్యాదు తీసుకొని వెతికి పెడతాంలే అని చెప్పాల్సిన పోలీసులు.. సీసీ కెమెరాలు లేవని సాకులు చెప్పటం ఎంతవరకు సమంజసం అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో ఏం సీసీ కెమెరాలు ఉన్నాయని పోలీసులు కేసులను ఛేదించారు. ఇప్పుడు సీసీ కెమెరాలు లేకపోతే పోలీసులు కేసులు ఛేదించలేరా అంటూ కొంతమంది పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా ఓ బంగారం వ్యాపారిని కిడ్నాప్ చేసింది ఎవరు అనేదానిపై ఇంతవరకు పోలీసులు చిన్న క్లూ కూడా పట్టుకోలేకపోయారు. ఇది ప్రస్తుతం పోలీసుల పనితీరు.