AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోనసీమ తిరుమల.. వాడపల్లిలో దైవభక్తితో పాటు దేశభక్తి.. ఆశ్చర్యపోయేలా ఇవిగో ఆనవాళ్లు..

భక్తులు రెచ్చిపోయి పోలీస్ పాలకులపై తిరుగుబాటు చేశారు. జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముస్తఫా అలీ ఖాన్ కోసం వెతకడం ప్రారంభించారు. భక్తుల వీరోచిత పోరాటానికి బిత్తర పోయిన పోలీసు ఉన్నతాధికారులు భయంతో గోదావరి వెంబడి పారిపోయారు.

కోనసీమ తిరుమల.. వాడపల్లిలో దైవభక్తితో పాటు దేశభక్తి.. ఆశ్చర్యపోయేలా ఇవిగో ఆనవాళ్లు..
Vadapalli Temple History
Pvv Satyanarayana
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 14, 2024 | 9:24 AM

Share

కోనసీమ జిల్లా వాడపల్లి ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరూ కోనసీమ తిరుమల అంటూ టక్కున చెబుతారు. అయితే వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి ఆలయానికే కాదు స్వాతంత్ర్య సమరంలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది… అవును మీరు విన్నది నిజమే.. మీరు ప్రదక్షిణలు చేస్తున్నా.. దైవ భక్తితో నిత్యం కొలుస్తున్న, మీ కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భారతమాత ద్రాస్యశృంఖలాలను తెంచడానికి ఆంధ్ర ప్రాంతంలో ఎందరో త్యాగధనులు శాంతి సమరం సాగించి ప్రాణాలర్పించిన గుర్తులు, ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ మహా జ్వాల పోరాట ఘట్టాలలో ప్రజల స్మృతి పదం నుంచి చెరిగిపోనిది వాడపల్లి రథయాత్ర. మారణ హోమం ఆంధ్రుల ఆధ్యాత్మిక, సామాజిక జీవితంలో దేశభక్తి ఏవిధంగా మమేకమైందో వివరిస్తుంది ఈ సంఘటన.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో 1931 సంవత్సరంలో చైత్ర శుద్ధ ఏకాదశి రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం ఆనందోత్సాహాలతో జరుగుతుంది. ప్రజలు తీర్థంరోజు మధ్యాహ్నం రథాన్ని అలంకరించి త్రివర్ణ పతాకం, గాంధీ, నెహ్రూ తదితర జాతీయ నాయకుల చిత్రపటాలను రథానికి ఉంచారు. రథయాత్ర తొలి అడుగు వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథం వైపునకు తీసుకువచ్చారు. ఇంతలో బ్రిటిష్ పోలీసులు రథానికి అలంకరించిన త్రివర్ణ పతకాలను, జాతీయ నాయకుల చిత్రపటాలను లాగి పారేశారు. అందుకు ఆగ్రహించిన భక్తులు రథాన్ని కదలనీయమని రథం లాగే రోడ్డు మీద బైఠాయించారు.

రెచ్చిపోయిన బ్రిటిష్ పోలీసు ఉన్నతాధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్( రాజమండ్రి) ముస్తఫా అలీ ఖాన్ రథం వద్ద బైఠాయించిన భక్తులపై నిర్ధాక్షిణ్యంగా తుపాకీ గుళ్ళ వర్షం కురిపించాడు. మరో డయ్యర్ గా చరిత్ర హీనుడయ్యాడు. అప్పటి ఆ సంఘటనలో కరుటూరి సత్యనారాయణ, (కట్టుంగ), వాడపల్లి గంగాచలం, పాతపాటి వెంకట్రాజు, మరో వ్యక్తి మొత్తం నలుగురు దేశభక్తులు నేలకొరిగారు. వందలాదిమంది కాకావికులై తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి మారణహోమంలోనూ ప్రజలు వెన్ను చూపలేదు. తీర్థంలో పోలీసు కాల్పులు ఆగాయి. పరుగులు తీసిన ప్రజలు మళ్లీ పోలీసుల మీదకి మెరుపులా దూసుకు రావడంతో తిరిగి కాల్పులు ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

భక్తులు రెచ్చిపోయి పోలీస్ పాలకులపై తిరుగుబాటు చేశారు. జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముస్తఫా అలీ ఖాన్ కోసం వెతకడం ప్రారంభించారు. భక్తుల వీరోచిత పోరాటానికి బిత్తర పోయిన పోలీసు ఉన్నతాధికారి ముస్తఫా అలీ ఖాన్, అప్పటి డిప్యూటీ కలెక్టర్, తాసిల్దార్ అక్కడి నుంచి లొల్ల లాకులు, ఆత్రేయపురంరేవు, బొబ్బర్లంక మీదుగా గోదావరి వెంబడి పారిపోయారు. ఈ తిరుగుబాటులో పాల్గొన్నారన్న ఆరోపణలతో వందలాది మంది యాత్రికులను ఆనాటి పాలకులు జైళ్లల్లోకి నెట్టారు.  ఆ నాటి కాల్పుల్లో ఎంతో మంది తుపాకీ తూటాలకు గాయపడ్డారు..

నాటి మహోత్తర ప్రజా పోరాటాన్ని చిరస్మరణీయం చేసేందుకు గాంధేయవాది, మాజీ ఎమ్మెల్యే ఎంవిఎస్ సుబ్బరాజు తదితరులు వాడపల్లి లో జరిగిన సంఘటనకు గుర్తింపుగా స్మారక చిహ్నం నిర్మించారు. నేటికీ వాడపల్లి సందర్శించిన యాత్రికులు స్మారక స్తూపం సందర్శించి నాటి అమరవీరులకు నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి