‘కన్నా.. లేవరా! ఇంటికి పోదాం..’ కుమారుడి మృతిని నమ్మలేక మృతదేహంతోనే తల్లి సంభాషణ

విధి కర్కశంగా ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అప్పటి వరకూ అల్లరి చేస్తూ కేరింతలు కొడుతున్న కొడుకు ఒక్కసారిగా దూరమవడంతో ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. హిస్టీరియాటిక్‌గా మారిపోయింది. ఆసుపత్రి బెడ్‌పై కుమారుడి మృత దేహం పక్కన పడుకుని తన బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొట్టసాగింది. బాబు నిద్ర నుంచి మేల్కొన్నాక అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోతామనీ చెబుతోంది. అంతా చూస్తున్న పిల్లాడి తండ్రి కన్న పేగును మెలిపెడుతుంటే.. మరోపక్క భార్య పడుతున్న మానసిక వేదన..

'కన్నా.. లేవరా! ఇంటికి పోదాం..' కుమారుడి మృతిని నమ్మలేక మృతదేహంతోనే తల్లి సంభాషణ
Road Accident In Annamaya District
Follow us

|

Updated on: Oct 08, 2024 | 1:22 PM

రాజంపేట, అక్టోబర్‌ 8: విధి కర్కశంగా ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అప్పటి వరకూ అల్లరి చేస్తూ కేరింతలు కొడుతున్న కొడుకు ఒక్కసారిగా దూరమవడంతో ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. హిస్టీరియాటిక్‌గా మారిపోయింది. ఆసుపత్రి బెడ్‌పై కుమారుడి మృత దేహం పక్కన పడుకుని తన బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొట్టసాగింది. బాబు నిద్ర నుంచి మేల్కొన్నాక అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోతామనీ చెబుతోంది. అంతా చూస్తున్న పిల్లాడి తండ్రి కన్న పేగును మెలిపెడుతుంటే.. మరోపక్క భార్య పడుతున్న మానసిక వేదన భరించలేక బావురుమన్నాడు. రోడ్డు ప్రమాదంలో కన్న బిడ్డ మరణించాడని చెప్పడానికి శత విధాలా ప్రయత్నించాడా భర్త. కానీ.. నిర్జీవంగా పడుకుని ఉన్న పసివాడు లేచి మళ్లీ ఆమెను నోరారా ‘అమ్మా’ అని పిలవలేడనే విషయాన్ని మాత్రం తల్లి మనసు అంగీకరించలేక పోతుంది. బిడ్డ పక్కన పడుకుని ‘కన్నా.. లేవరా ఇంటికి పోదాం’ అంటూ ఆమె అంటున్న మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెను ద్రవింపజేసింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో సోమవారం (అక్టోబర్‌ 7) ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న పిల్లాడు (3) ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. అయితే ఇంటి వద్ద పెద్ద కుమారుడిని ఒక్కడినే వదిలి వెళ్లలేక.. బైక్‌పై ఇద్దరు కుమారులను ఎక్కించుకుని భర్తతోపాటు ఆస్పత్రికి పయనమయ్యారు. అలా రాజంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపు తప్పి అందరూ రోడ్డుపై పడిపోయారు. దీంతో తండ్రి ముందు కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్‌(5) ఎగిరి రోడ్డుపై పడ్డాడు. దీంతో బాలుడి తలకు తీవ్రమైన గాయం అయ్యి రక్తస్రావం అయ్యింది.

స్థానికుల సహాయంతో హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్యామ్‌ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని కుమారుడు నిద్రపోతున్నాడని, నిద్రలేచాక ఇంటికి వెళ్లిపోతామని భ్రమిస్తూ బిడ్డకు జోల పాడుతూ ఉండిపోయింది. చిన్నారి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా.. ఆమె మాత్రం పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళ్దామని చెప్పడంతో చేసేదిలేక అతనూ విలపిస్తూ ఉండిపోయాడు. ఈ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.