
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతోన్న లారీ శనివారం రాత్రి మంటల్లో చిక్కుకుంది. అయితే, సిలిండర్లకు మంటలు అంటుకోకపోవడంతో ముప్పు తప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం రాత్రి కాకినాడ నుంచి హైదరబాద్ వెళుతోన్న గోయల్ ఎమ్జి గ్యాస్ లారీలో.. అనుమంచిపల్లి దగ్గర హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజనులో అంటుకున్న నిప్పు లారీ అంతటా వ్యాపించడంతో జాతీయ రహదారిపై భారీగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటన అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మంటలు చెలరేగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, అక్కడే ఉండి లారీ ఫొటోలు తీస్తున్న లారీ క్లీనర్ పోలీసుల చేతికి చిక్కాడు. మంటలు సిలిండర్లకు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో మొత్తం 161 హైడ్రోజెన్ గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిలిండర్లకు మంటలు అంటుకోకపోవడంతో ముప్పు తప్పిందని లేకపోతే.. భారీ ప్రమాదం జరిగేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
లారీ క్యాబిన్ కి ట్రక్కుకి గ్యాప్ ఎక్కువ ఉండటంతో.. లారీ క్యాబిన్ ఐరన్ ది కావడంతో మంటలు సిలిండర్లకు అంటుకోలేదని పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖ, ఫైర్ శాఖ తక్షణం స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..