Andhra Pradesh: “ఈ స్థలం మాదే.. అన్యాయంగా లాక్కోకండి సారూ”.. కర్నూలు జిల్లాలో ఓ కుటుంబం ఆవేదన

"యాభై ఏళ్లుగా ఆ స్థలంలో కట్టెలు వేసుకుని జీవనోపాధి పొందుతున్నాం.. ఆ స్థలం మాదే సార్.. అన్యాయంగా ఆ స్థలాన్ని మా దగ్గర నుంచి లాక్కోకండి.. మా కడుపు కొట్టకండి".. అంటూ ఓ మహిళ కన్నీటిపర్యంతమైన ఘటన....

Andhra Pradesh: ఈ స్థలం మాదే.. అన్యాయంగా లాక్కోకండి సారూ.. కర్నూలు జిల్లాలో ఓ కుటుంబం ఆవేదన
Kurnool Incident

Updated on: Jun 03, 2022 | 10:34 AM

“యాభై ఏళ్లుగా ఆ స్థలంలో కట్టెలు వేసుకుని జీవనోపాధి పొందుతున్నాం.. ఆ స్థలం మాదే సార్.. అన్యాయంగా ఆ స్థలాన్ని మా దగ్గర నుంచి లాక్కోకండి.. మా కడుపు కొట్టకండి”.. అంటూ ఓ మహిళ కన్నీటిపర్యంతమైన ఘటన కర్నూలు(Kurnool) జిల్లా గూడూరు మండలం గుడిపాడులో జరిగింది. గ్రామానికి చెందిన మీనాక్షమ్మ అనే మహిళ.. తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలు వేసుకుంది. అయితే ఆ స్ధలంలో రైతు భరోసా(Raitu Bharosa) పాలకేంద్రం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రెవెన్యూ అధికారులు మీనాక్షమ్మ ఇంటి వద్దకు జేసీబీతో చేరుకుని కట్టెలు తొలగించే ప్రయత్నం చేశారు. ఇంటి ముందు ఉన్న స్ధలం తమదేనని, యాభై ఏళ్ల నుంచి ఆ స్ధలంలో కట్టెలు వేసుకుంటున్నామని మీనాక్షమ్మ ప్రాధేయపడినా రెవెన్యూ సిబ్బంది కనికరించలేదు. దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని మీనాక్షమ్మ ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు అప్రమత్తమై మీనాక్షమ్మను అడ్డుకున్నారు. అంతే కాకుండా అక్కడే ఉన్న మీనాక్షమ్మ కుమార్తెలను మహిళా కానిస్టేబుల్ చున్నీతో కట్టి, స్ధలం దగ్గరకు వెళ్లకుండా చేశారు. తమను విడిచి పెట్టాలని మీనాక్షమ్మ కూతుళ్లు మహిళా పోలీసులను అడిగినా వాళ్లు చలించలేదు. స్ధలం ఖాళీ చేశాకే వారిని విడిచిపెట్టారు.

స్థానిక వైసీపీ నేతల మాటలు విని, స్థలాన్ని ఖాళీ చేస్తున్నారని మీనాక్షమ్మ కుటుంబంసబభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. తహసీల్దారు గీతాప్రియదర్శిని మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబరు 75లోని 24 సెంట్ల ప్రభుత్వ స్థలంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పాలకేంద్రం నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అందులోని కొంతభాగంలో వారు కట్టెలు వేసుకున్నారన్నారు. వారి వద్ద ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పట్టాలూ లేవన్నారు. అర్హతలు పరిశీలించి వేరే చోట వారికి ఇంటిస్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి