Uyyuru: వృద్ధులకు ఫేక్ పోలీస్ వీడియో కాల్.. ఒక్కసారిగా ఎంటరయిన రియల్ ఖాకీ.. కట్ చేస్తే
రిటైర్డ్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భయపెట్టి డబ్బులు దోచుకునే ప్రయత్నం కృష్ణా జిల్లా ఉయ్యూరులో విఫలమైంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో వీడియో కాల్ చేసి సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయిందని నమ్మబలికే ప్రయత్నం చేసిన మోసగాళ్లను స్థానిక పోలీసుల చాకచక్యంతో బట్టబయలు చేశారు.

రిటైర్డ్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలు దోచేస్తున్న సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం నుంచి కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ పోలీసులు ఇద్దరు వృద్ధులను రక్షించారు. అకౌంటెంట్గా, టీచర్గా పనిచేసి రిటైర్ అయిన కోటా శివశంకర్ (70), ఆయన భార్య ఉయ్యూరు టౌన్లో ఏజీ & ఎస్జి కాలేజ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం సుమారు 11 గంటల సమయంలో శివశంకర్కు ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ఆధార్ కార్డు ద్వారా రూ.25 లక్షల మనీ రూటింగ్ జరిగిందని, దానికి సంబంధించి మీపై సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని భయపెట్టారు. అంతేకాకుండా, సుప్రీంకోర్టు జడ్జిగా నటించిన వ్యక్తిని వీడియో కాల్లో మాట్లాడిస్తూ నమ్మించే ప్రయత్నం చేశారు. మీ బ్యాంక్ అకౌంట్లు, స్థిర–చరాస్తుల వివరాలు వెంటనే ఇవ్వాలని, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. చెబితే లోకల్ పోలీసులు వచ్చి వెంటనే అరెస్ట్ చేసి ముంబైకి తరలిస్తారని బెదిరించారు. ఈ బెదిరింపులతో వృద్ధ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పరిస్థితిని అంచనా వేసిన వారు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఇరుక్కున్నామని భావించి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆ సమయంలో కూడా వీడియో కాల్ లైవ్లోనే కొనసాగుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లైవ్లో అసలు పోలీసులను చూసిన వెంటనే సైబర్ నేరగాళ్లు కాల్ కట్ చేసి ఆఫ్లైన్కి వెళ్లిపోయారు. ఈ ఘటనతో పెద్ద మోసం తప్పింది.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. డిజిటల్ అరెస్ట్ అనే పదం గానీ, పద్ధతి గానీ ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, సీబీఐ వంటి సంస్థల పేర్లు చెప్పి మాట్లాడుతున్నామని, మీ ఆధార్ కార్డు, సిమ్ కార్డులు మనీ ల్యాండరింగ్ లేదా డ్రగ్స్ రవాణాలో ఇరుక్కున్నాయని చెబితే నమ్మవద్దని సూచించారు. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. డిజిటల్ మోసాలపై అప్రమత్తతే ప్రధాన ఆయుధమని పోలీసులు చెబుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
