
ఏలూరు : ప్రపంచంలో విలువ కట్టలేని తల్లి ప్రేమ. అమృతం కంటే విలువైనవి తల్లి పాలు. అప్పుడే పుట్టిన ఎందరో శిశువులకు తల్లిపాలు అందడం లేదు. శిశువుల ఆకలితీర్చి, బలాన్ని చేకూర్చి, దివ్య ఔషధంలా పనిచేస్తాయి తల్లిపాలు. బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా పెరిగేందుకు సహకరిస్తాయి. అటువంటి అమ్మపాలకు దూరమై కొందరు శిశువులు రోగాల బారిన పడుతున్నారు. ఇటువంటి చిన్నారులను ఆదుకునేందుకు తల్లి పాల బ్యాంకు లను ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ హాస్పిటల్ లో “ధాత్రి తల్లిపాల బ్యాంకు” పేరుతో ఇది నడుస్తుంది.
సుషేణ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధాత్రి తల్లిపాల బ్యాంకును నిర్వహిస్తున్నారు. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన తల్లి పాలు బ్యాంకు నుండి ప్రతి నేలా 400 మంది వరకూ సద్వినియోగం చేసుకుంటున్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో భీమవరంలో ( ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ) తల్లిపాల బ్యాంకు ఏర్పాటు చేసారు. ఈ సంస్థ ద్వారా తల్లి బిడ్డలకు అనేక సేవలు అందిస్తారు. తల్లి బిడ్డలకు పాలు ఇవ్వడంలో ఇబ్బందులు గుర్తిస్తారు. పుట్టిన గోల్డెన్ అవర్ లో బిడ్డకు తల్లి పాలు పట్టిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తల్లికి వివరణ ఇస్తారు. క్లారిటీ చేస్తారు. తల్లి దగ్గర తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను తల్లి అనుమతితో తీసుకుని స్టోర్ చేస్తారు. తల్లి తనంతట తానుగా డొనేట్ చేసిన పాలను మిషన్ ద్వారా సేకరిస్తారు. అనంతరం పాశ్చరైజేషన్ చేసి తల్లి పాలు అందని బిడ్డలకు అందజేస్తారు.
ఈ ప్రాసెస్ లో తల్లికి సంబంధించిన అన్ని పరీక్షలు జరుపుతారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న తల్లి వద్ద మాత్రమే పాలను సేకరిస్తారు. పుట్టిన బిడ్డ సంపూర్ణ మానిసిక, శారీరక వికాసం తల్లి పాలతోనే సాధ్యం అవుతుందని తల్లిపాలు పిల్ల ఎదుగుదలకు , మానసిక వికాసానికి కావాల్సిన పోషణ ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. సృష్టిలో అమ్మ ప్రేమని మించినది మరొకటిలేదంటారు కదా అందుకేనేమో చాలామంది తల్లులు తమవద్ద మిగిలిన పాలను అవసరమైన పసికందులకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు . ఎందరో బిడ్డల ఆకలితో పాటు వారి భవిష్యత్తునూ తీర్చి దిద్దుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..