NTR District: మాయదారి కొబ్బరిబొండం ఎంత పని చేసింది..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బైపాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు వెనుక సీట్లో ఉన్న కొబ్బరిబొండం బ్రేక్, క్లచ్ పెడళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనం, అనంతరం కంటెయినర్ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పోలీస్స్టేషన్ పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డుపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్ (52)తో పాటు మరో వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందారు. కారు బ్రేక్, క్లచ్ పెడళ్ల మధ్య కొబ్బరిబొండం ఇరుక్కుపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్ చిన్న కుమారుడి వివాహ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో వధువు ఇంట్లో జరిగింది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఒక కారులో, హరిప్రసాద్ తన బంధువుతో కలిసి పూజా సామగ్రి తీసుకుని మరో కారులో రాజమహేంద్రవరం బయలుదేరారు.
విజయవాడ సమీపంలోని నల్లగుంట వద్ద హరిప్రసాద్తో ప్రయాణిస్తున్న బంధువు కారు దిగిపోయారు. అనంతరం గొల్లపూడి బైపాస్ సమీపానికి చేరుకున్న సమయంలో హరిప్రసాద్ నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ముందుగా ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఆ తర్వాత రోడ్డుపక్కన నిలిచి ఉన్న కంటెయినర్ను బలంగా ఢీకొట్టింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రభావంతో వెనుక సీట్లో ఉన్న కొబ్బరిబొండం ముందుకు ఎగిరి వచ్చి బ్రేక్, క్లచ్ పెడళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వాహనాన్ని నియంత్రించలేక కంటెయినర్ను ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
