Andhra Rains: ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం
ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు వానలు పడనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణశాఖ వెదర్ బులిటెన్ విడుదల చేసింది. పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు ప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇక రాయలసీమకు కూడా వర్షసూచన జారీ చేసింది. ఈ ప్రాంతంలో మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడ్రోజుల పాటు కూడా వానలు కొనసాగున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలతో తెలుస్తోంది. అయితే ఎల్నివో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవుతోంది.
