CM Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్
అధికారులు ఎలా పనిచేస్తున్నారు.. వాళ్ల పనితీరు ఎలా ఉందని నేరుగా ప్రజల ముందే బయటపెట్టారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగి పనితీరును మెరుగు పర్చుకోవాలంటూ తెలిపారు. తామూ పూర్తిగా సహకరిస్తామని, అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.

అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్ను యాడికి జలధార సభలో చదివి వినిపించిచారు సీఎం చంద్రబాబు. వివిధ శాఖల పనితీరు నివేదికలను ప్రజల ముందు ప్రజెంట్ చేసిన ఆయన సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగు పర్చుకోవాలని సూచించారు. అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తామని అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. భూవివాదాలనేవి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజా సంతృప్తే లక్ష్యంగా పని చేయాలని, ప్రజలకు సేవలందించాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ట్రాక్టర్లల్లో ఇసుక తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా..? అని ప్రజలనే నేరుగా సభలో అడిగారు సీఎం చంద్రబాబు. ఎవ్వరూ అడ్డుకోవడం లేదని ప్రజలు సమాధానం ఇచ్చారు. ఆదాయం తగ్గినా పర్వాలేదనుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు సీఎం. ట్రాక్టర్లల్లో ఇసుక తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాగా పని చేసిన అధికారును అభినందించాలంటూ ప్రజలతో చప్పట్లు కొట్టించారు. చక్కగా పని చేసిన వారిని ప్రొత్సహిస్తాం.. ఇంకా పని చేయని వారిని గాడిలో పెట్టేలా చేస్తామన్నారు. అధికారులపై కావాలని ఫిర్యాదులు చేయకుండా.. పనితీరు ఆధారంగా బేరీజు వేయాలని ప్రజలకు సీఎం సూచించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా సూపర్ అచీవర్స్.. అచీవర్స్.. పెర్ఫార్మర్స్.. లెర్నర్స్ గా విభజిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇకపై తాను వచ్చే ప్రతీ సభకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం హాజరవ్వాలని సీఎం అన్నారు. పనితీరు ఆధారంగానే ప్రజా ప్రతినిధులను, రాజకీయ పార్టీలను విశ్లేషించేలా ఆలోచన చేయాలన్నారు సీఎం చంద్రబాబు.
మరోవైపు గత ప్రభుత్వంలో వ్యవస్థలు ఏ విధంగా విధ్వంసం జరిగిందో వివరించారు సీఎం చంద్రబాబు. గత పాలకులు మనకు అడ్రస్ లేకుండా చేశారని.. ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందన్నారు. గతంలో మూడు ముక్కలాట ఆడారు. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం అన్నారు. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికాయన్నారు.
అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. చూసి సహించలేక ఫ్రస్టేషన్ తో అవినీతి జరిగిందని అంటున్నారని మండిపడ్డారు. 2047 నాటికి ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నామని.. దీనికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాంమన్నారు. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ గోదావరి వరకూ విశాఖ, ప్రకాశం- నెల్లూరు వరకూ అమరావతి, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి రీజియన్లుగా తయారవుతాయన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
