Anandaiah Medicine: కృష్ణపట్నం అనందయ్య మందుపై వివాదం కొనసాగుతోంది. మందుపై ఆయూష్తో పాటు టీటీడీ ఆయుర్వేద కళాశాల అధ్యయనం చేస్తోంది. అతి త్వరలో ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. నివేదికలు వచ్చిన తర్వాతే మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అయితే ఆనందయ్య మందుపై 32 బృందాలు పరిశీలిస్తున్నాయి. మందు తీసుకున్న 500 మందికి బృందం సిబ్బంది ఫోన్లు చేస్తుండగా, తాము మందు తీసుకోలేదని చాలా మంది చెబుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా వెళ్లి మందు వాడినవారి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య నాటుమందు పంపిణీపై ఏపీ హైకోర్టులో 2 హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ మందు తయారీ కోసం ఆయన 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె ఇలా 18 రకాల పదార్థాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారు. అన్నీ కూడా సహజంగా దొరికే పదార్థాలు. వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదు. మందుల తయారీ విధానాన్ని మొత్తం మాకు చూపించారు. ఫార్ములా కూడా చెప్పారని రాష్ట్ర ఆయూష్ కమిషన్ ముఖ్యమంత్రి జగన్కు నివేదిక అందజేశారు.
కాగా, ఆనందయ్య మందుపై ఢిల్లీలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆనందయ్య నాటుమందుపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతామని, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆనందయ్యకు పోలీసు భద్రత కల్పించారు.