వింటర్లో పల్లీ చక్కీ తినొద్దండోయ్.. అసలు మ్యాటర్ ఇదే
venkata chari
చలికాలం రాగానే మనకు వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉండటంతో ఆకలి కూడా ఎక్కువే వేస్తుంది. అయితే, ఈ కాలంలో మనం ఇష్టంగా తినే కొన్ని సంప్రదాయ ఆహారాలు మన శరీర బరువును విపరీతంగా పెంచుతాయని మీకు తెలుసా?
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ఇటీవల జరిపిన విశ్లేషణలో.. మనం స్నాక్స్లా భావించే రెండు ఆహార పదార్థాలు మన మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం కంటే ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయని వెల్లడించారు.
చలికాలంలో బెల్లం, నువ్వులతో చేసిన గజక్ లేదా పల్లీ పట్టిని చాలామంది అమితంగా ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి మంచివే అని మనం అనుకుంటాం, కానీ పరిమితి మించితే ఇవే కొవ్వుకు ప్రధాన వనరులు.
గజక్లో చక్కెర లేదా బెల్లం సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది తింటే దాదాపు 400-500 కేలరీలకు సమానం. ఇది మనం తినే ఒక పూర్తి భోజనంతో సమానమైన శక్తిని ఇస్తుంది.
చలి సాయంత్రం వేళ వేయించిన వేరుశనగలు తినడం ఒక అలవాటుగా ఉంటుంది. "టైమ్ పాస్" కోసం తినే ఈ గింజలు మీ నడుము చుట్టుకొలతను పెంచేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నప్పటికీ, వాటిలో కేలరీల సాంద్రత చాలా ఎక్కువ. 100 గ్రాముల వేరుశనగల్లో సుమారు 560 కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. అంటే ఒక గిన్నెడు వేరుశనగలు తింటే, మీ డైట్ ప్లాన్ మొత్తం తలకిందులైనట్లే.
మీకు పల్లీలు తినాలనిపిస్తే, వాటిని భోజనానికి ప్రత్యామ్నాయంగా కాకుండా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోండి. వేయించిన వేరుశనగలకు బదులుగా నానబెట్టిన బాదం లేదా వాల్నట్స్ తీసుకోవడం ఉత్తమం.
చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. దీనివల్ల ఆకలి అనిపించవచ్చు. నీరు తగినంత తాగితే స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం కూడా మోతాదు మించితే అనారోగ్యానికి దారి తీస్తుంది.
ఈ వింటర్ సీజన్లో పల్లీ పట్టి, వేరుశనగలను స్నాక్స్లా కాకుండా.. అధిక కేలరీలు ఉన్న ఆహారంగా గుర్తించి జాగ్రత్తగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.