రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన చారిత్రక కలయిక జరిగిందని జనసేన అధినేత వన్కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో టీడీపీ-జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో నారా లోకేశ్, పవన్ కల్యాణ్తో పాటు ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. రెండు పార్టీల ఐక్య కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ సర్కారును రెండు పార్టీలు కలిసి గట్టిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మీ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానమిస్తూ.. రాష్ట్ర భవిష్యత్తుపైనే రెండు పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో చర్చించామని చెప్పారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాలన్నారు. పదవుల గురించి ఆ తర్వాత చర్చించుకుంటామని పవన్ వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల నాయకులను వైసీపీ నేతలు ఇబ్బందిపెడుతున్నారని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని గతంలో చెప్పామని.. రాష్ట్ర అభివృద్ధే జనసేన పార్టీకి ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలన్న దానిపై రాజమండ్రిలో జరిగిన భేటీలో చర్చించినట్లు తెలిపారు. రెండు పార్టీలు ఎలా కలిసి పనిచేయాలన్నదానిపై చర్చించినట్లు తెలిపారు. రెండు పార్టీల కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
రాష్ట్ర శ్రేయస్సు కోసమే టీడీపీ -జనసేన కలుస్తున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. సున్నాలు ఎన్ని కలిసినా సున్నానే అవుతుందన్నారు. రాజమండ్రిలో పుత్రుడు, దత్తపుత్రుడి సమావేశం అట్టర్ప్లాప్ అయ్యిందన్నారు. పవన్ కల్యాణ్ కొత్తగా టీడీపీతో కలిశారా? అని ప్రశ్నించారు. 2014లోనే కలిసే పోటీ చేశారు కదా అని గుర్తుచేశారు. టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన అంటూ ఎద్దేవా చేశారు. జైలులో ఉన్న చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడానికి.. లోకేశ్ పల్లకి మోయడానికే ఈ సమావేశం పెట్టుకున్నారని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని అంబటి వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి కామెంట్స్..