
ఏలూరు, అక్టోబర్ 25: అక్కడి ప్రకృతి అందాలు పర్యాటకలను కట్టిపడేస్తాయి. ఎటు చూసినా ఆహ్లాదకర ప్రదేశం, ఎత్తయిన కొండలు, మధ్యలో గోదావరి గలగలలు.. మరోపక్క ప్రశాంత వాతావరణం.. అయితే అలాంటి ఆహ్లాదకర వాతావరణం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా..? అక్కడి ప్రత్యేకతలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.. ఏలూరు జిల్లా విలీన మండలం వెలేరుపాడు మండలం గోదావరి నది పరివాహక ప్రాంతం.. విలేరుపాడు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కట్కూరు అనే గ్రామం ఉంది. అయితే అక్కడ సుందర వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సంవత్సరం పొడుగునా కాలాలతో సంబంధం లేకుండా పచ్చదనం ఆ ప్రదేశంలో పరిమళిస్తుంది. అయితే ఒక్క గోదావరి ఉధృతి సమయంలో తప్ప మిగతా రోజులలో అక్కడికి సులభంగా వెళ్లవచ్చు.
చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో గోదావరి ప్రవాహం, నది ఒడ్డున కట్కూరు గ్రామం ఉంది. అలాగే మరొకవైపు కొండపై ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన శివాలయం అక్కడ మనకు దర్శనమిస్తుంది. చాలామంది పర్యాటక ప్రేమికులు ఆ ప్రదేశంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. వేలూరుపాడు నుంచి కట్కూరికి రోడ్డు మార్గం ద్వారా వెళుతుండగా కొండల నుంచి వచ్చే చల్లని గాలి, ఎత్తు పల్లాలతో చిన్నచిన్న గాటిల మాదిరిగా ఉన్న రహదారి, రహదారికి ఇరువైపులా పచ్చనీ పంటలతో సుందరంగా ఉండి మరో అరకుల ఆ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాగే మహాశివరాత్రి నాడు కొండపై శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్య స్థానాలు ఆచరించి శివాలయంలో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తారు. శివాలయం ప్రాంతం నుంచి గోదావరి నదికి మరోవైపున ఉన్న కొండలు ఎంతో రమణీయంగా ప్రకృతి పరవశింప చేసేలా కనిపిస్తాయి.
అదేవిధంగా శీతాకాలంలో మంచు కొండలను తాకుతూ గోదావరి నదిపై నుంచి ప్రయాణం చేస్తున్నట్లుగా ఓ మంచు దుప్పటిలాగా ఆ ప్రాంతాన్ని ఆవరించి కాశ్మీర్ అందాలను తలదన్నేలా పర్యాటకులను రంజింప చేస్తాయి. ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అక్కడికి వచ్చి ఆ అందాలను తిలకిస్తారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అందాలు కనుమరుగే ప్రమాదం ఉంది. దాంతో చాలామంది ఇటీవల ఆ ప్రాంతానికి కుటుంబాలతో విహారయాత్రకు వెళుతున్నారు. కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు ఆ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతుంది. అయితే పర్యాటకు కావలసిన పూర్తిస్థాయి సౌకర్యాలు మెరుగుపరిచి, అక్కడ బస చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.