AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. సాధారణ బియ్యం స్థానంలో..

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు పేదలకు మెరుగైన నాణ్యత గల బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీమ్ రైస్ పంపిణీపై దృష్టి సారించింది. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం ప్రజా పంపిణీ వ్యవస్థలో దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.

Andhra: ఏపీలోని పేదలకు గుడ్ న్యూస్.. సాధారణ బియ్యం స్థానంలో..
Steam Rice
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 08, 2026 | 4:27 PM

Share

పేదలకు నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేస్తున్న సాధారణ బియ్యం స్థానంలో దశలవారీగా స్టీమ్ రైస్ అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముందుగా ఈ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఫలితాలను పరిశీలించిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయిలో అమలు చేసే అవకాశాలను అధ్యయనం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, దాదాపు 4.3 కోట్ల మంది లబ్ధిదారులు ప్రతి నెలా రేషన్ బియ్యం పొందుతున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అయితే ఈ బియ్యంలో కొంత భాగం అక్రమ రవాణాకు గురవుతోందన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు, పౌల్ట్రీ పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు రేషన్ బియ్యం మళ్లుతున్న ఘటనలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో అక్రమ రవాణాపై ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 5,354 కేసులు నమోదు చేసి, 73.76 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రవాణా నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాల వారీగా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన రేషన్ సంచార వాహనాల వ్యవస్థను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ వ్యవస్థ నిర్వహణ వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.

స్టీమ్ రైస్ అమలుపై ప్రభుత్వం ఆసక్తి చూపడానికి ప్రధాన కారణాల్లో నాణ్యత, నిల్వ సామర్థ్యం మరియు అక్రమ రవాణా నియంత్రణ ముఖ్యమైనవి. సాధారణ బియ్యంతో పోలిస్తే స్టీమ్ రైస్ ఎక్కువకాలం నిల్వ ఉండటంతో పాటు వాణిజ్యపరంగా అక్రమంగా విక్రయించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్టీమ్ రైస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు స్టీమ్ రైస్ అందించి, దాని ప్రభావాన్ని అధ్యయనం చేసిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో దశలవారీగా అమలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ ధరలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్యాస్ ధరల పెరుగుదల వల్ల కలిగే అదనపు భారాన్ని ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే దీర్ఘకాలిక పరిష్కారంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వ్యవస్థ విస్తరణపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

పేదలకు నాణ్యమైన బియ్యం అందించడం, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడం, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో స్టీమ్ రైస్ ప్రతిపాదన కీలకంగా మారింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ కార్డుదారులకు స్టీమ్ రైస్ అందించే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us