Weather Update: ఓ పక్క వర్షాలు.. మరో పక్క ఎండలు.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే సందర్భంలో మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బుధవారం కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైందని.. అలాగే 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ఇక గురువారం కూడా రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం 50 మండలాల్లో తీవ్ర వడగాలులు, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు పలు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ సమయంలో 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు.
గురువారం తీవ్రవడగాల్పులు వీచే జిల్లాలు ఇవే
శ్రీకాకుళం 19, విజయనగరం 24, మన్యం 3, అల్లూరి 5, పోలవరం 8, విశాఖ1, అనకాపల్లి 13, కాకినాడ 10, తూర్పుగోదావరి 6, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో(95) తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కాబట్టి ప్రజలు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. అదేవిధంగా కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు.
గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో ఎక్కువగా తిరగరాదన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. ఎండ తీవ్రత సమాచారం కోసం ఏపిఎస్డీఎంఏలోని కంట్రోల్ రూమ్ 112, 1070, లేదా 1800 425 0101 నెంబర్లు సంప్రదించవచ్చని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
