Andhra News: ఇకపై ఏపీలో ఆధార్‌ను మించిన ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్.. వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఆధార్‌ను మించిన సూపర్ స్మార్ట్ కార్డ్‌ను ఇవ్వబోతుంది. ఈ కార్డుతో లబ్ధిదారులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలనీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు.

Andhra News: ఇకపై ఏపీలో ఆధార్‌ను మించిన ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్స్.. వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra News

Edited By: Anand T

Updated on: Nov 25, 2025 | 9:28 AM

రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు. సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని ఆదేశించారు.రియల్ టైమ్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలన్నారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. 25 రకాల వివరాలతో పాటు పీ4 లాంటి అంశాలను కూడా అందులో చేర్చాలన్నారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు.

వన్ సొల్యూషన్ ఫర్ ఆల్

స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు. వాక్సినేషన్, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు , స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు.

అర్హులందరికీ స్మార్ట్ కార్డులు

కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్‌బీఎంఎస్ వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించటంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కొన్ని పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని అన్నారు.

ఒకే కార్డు ద్వారా పౌరసేవలు

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం సూచనలు ఇచ్చారు. ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డుగా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఆధార్ సహా అన్ని వివరాలూ ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్‌లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.