- Telugu News Andhra Pradesh News Andhra Pradesh: Bapatla Man put posters on roads for seeking bride for marriage
Marriage: పెళ్లి కావాలంటూ నడి రోడ్డుపై పంచాయితీ! ఊరంతా పోస్టర్లు అతికించి హల్చల్..
యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడో యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై దుఖాణం తెరిచాడు. రోడ్డుపై గొడుగు ఏర్పాటు చేసి స్వయంవరానికి కౌంటర్ తెరిచాడు. ఇంతకీ ఎవరా యువకుడు, ఏందీ పెళ్లి గోలా అనే వివరాలు తెలుకోవాలంటే బాపట్లజిల్లాకు వెళ్ళాల్సిందే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండల ..
Fairoz Baig | Edited By: Srilakshmi C
Updated on: Oct 15, 2023 | 5:54 PM

బాపట్ల, అక్టోబర్ 15: యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడో యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై దుఖాణం తెరిచాడు. రోడ్డుపై గొడుగు ఏర్పాటు చేసి స్వయంవరానికి కౌంటర్ తెరిచాడు. ఇంతకీ ఎవరా యువకుడు, ఏందీ పెళ్లి గోలా అనే వివరాలు తెలుకోవాలంటే బాపట్లజిల్లాకు వెళ్ళాల్సిందే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండల రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్ అనే యువకుడు బికాం డిగ్రీ పూర్తి చేశాడు. ఇతనికి యుక్త వయస్సు వచ్చినా పెళ్ళి కాక పోవడంతో తనంటే ఇష్టపడే అమ్మాయిలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చీరాలలోని పలు ప్రాంతాల్లో సైకిల్ పై తిరుగుతూ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాడు.

తనను పెళ్ళి చేసుకోదలచిన వారు తమ పేరు ఫోన్ నంబర్ ను తన వద్ద ఉన్న పుస్తకంలో రాయాలని లేదా స్వయంగా తన ఇంటికి రావాలంటూ చెబుతున్నాడు. అయ్యప్పకుమార్ గతంలో కూడా ఇదే విధంగా వాల్ పోస్టర్లను అంటించి తన ఇంటి గోడలపై సైతం అమ్మాయిలు తనకు ఫోన్ చేయాలంటూ రాశాడు. దీంతో పోలీసులు అయ్యప్ప కుమార్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు మందలించి పంపించారు.

తిరిగి తాజాగా తనను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఏకంగా ఆహ్వాన పత్రిక తో కౌంటర్లనే ఏర్పాటు చేశాడు. తాను కేవలం తన పెళ్ళికోసం ఏర్పాటు చేసుకున్న స్వయంవరం మాత్రమేనని ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదని.. అయ్యప్ప కుమార్ చెబుతున్నాడు. పెళ్ళి కోసం అయ్యప్పకుమార్ ఎంచుకున్న పద్ధతిని చూసి జనం విస్తుపోతున్నారు.

పెళ్ళిళ్ళ పేరయ్యలకు చెబితే తగిన సంబంధం వెతికిపెడతారు. లేకుంటే మ్యారేజ్ బ్యూరోలను సంప్రదించవచ్చుకదా. అంతేకానీ నడిరోడ్డుపై ఇదేం పంచాయితీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే సదరు యువకుడు మాత్రం ఇలా మాత్రం ఎందుకు చేయకుడదూ. నా జీవత భాగస్వామిని నేనే స్వయంవరంలో స్వయంగా ఎంచుకుంటానని చెబుతున్నాడు. బుర్రకో బుద్ది, జిహ్వకో చాపల్యం అంటే ఇదేనేమో!





























