AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో,టాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్ధిక సాయం.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకపోయినా.. అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నా..ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే విధంగా సాగుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికలకు ముందు జరిపిన ప్రజా సంకల్పయాత్రలో జగన్ ఆయా వర్గాలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చుతున్నారు. తాజాగా ఏపీలో ఆటో, ట్యాక్సీ డైవర్లకు ఏడాదికి రూ.10 వేల ఆర్ధిక సాయం […]

ఆటో,టాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్ధిక సాయం.. ఏపీ ప్రభుత్వం  నిర్ణయం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 5:13 PM

Share

రాష్ట్రాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకపోయినా.. అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నా..ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే విధంగా సాగుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికలకు ముందు జరిపిన ప్రజా సంకల్పయాత్రలో జగన్ ఆయా వర్గాలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చుతున్నారు.

తాజాగా ఏపీలో ఆటో, ట్యాక్సీ డైవర్లకు ఏడాదికి రూ.10 వేల ఆర్ధిక సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వీరిని ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్ల రూపాయలు ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ నెలఖారున దీనికి శ్రీకారం చుట్టేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై చర్చించిన మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఈ పథకంలో లబ్దిదారులను గుర్తించడం కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రేపటి(మంగళవారం)నుంచి అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణాశాఖ ఏర్పాట్లు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు 6.63 లక్షల ఆటోలు,టాక్సీలు ఉన్నట్టుగా అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో కొంతమంది సొంతంగా యజమానులే డ్రైవర్లుగా తమ వాహనాలు నడుపుతుండగా, మరికొంతమంది అద్దె వాహనాలు నడుపుతున్నారు. అయితే సొంతవాహనాలు నడుతున్న వారి వాహనాలు 3.97 లక్షలకు పైగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిని లబ్దిదారులుగా గుర్తించే విధంగా ఈనెల ఆఖరి వారంలో మరోసారి దరఖాస్తులు పరిశీలించి కొంతమందిని ఫైనల్ లబ్దిదారులుగా ఎంపికచేయనున్నారు. వీరికి రూ.10వేలు నగదును బ్యాంకులో జమచేయనున్నారు. ఈ పనులన్నీ గ్రామ వాలంటీర్ల పర్యవేక్షణలో జరగునున్నాయి.

ఆటో, టాక్సీ డ్రైవర్లు ఫిటెనెస్, ఇన్స్యూరెన్స్, వాహన మరమ్మత్తులు వంటివాటికి ప్రతిఏటా రూ.10 వేలు ఖర్చుపెట్టాల్సివస్తోంది. గత ప్రభుత్వం వీరికి లైఫ్ ట్యాక్స్ పేరుతో కొత్త విధానాన్ని సైతం తీసుకొచ్చింది. దీంతో డ్రైవర్లు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రజసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసిన ఆటో, టాక్సీ డ్రైవర్లు తమ ఇబ్బందుల్ని చెప్పుకున్నారు. అప్పుడే ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.10 వేలు ఆర్ధిక సాయం చేస్తామంటూ హమీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటో,టాక్సీ డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఉన్న వివరాలు చూస్తే సొంతంగా ఆటో, ట్యాక్సీ నడుపుతున్న వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేయాలంటే కనీసం రూ.400 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆటో, టాక్సీ డైవర్లను ఆదుకునే విషయంలో బడ్జెట్‌ కేటాయింపులు జరిగినట్టు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. మంగళవారం లేదా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రవాణా శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో విధివిధానాలు ఖరారు చేసి వెల్లడించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.