AP News: ఏపీకి గుడ్ న్యూస్..త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం!
ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింటి. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయబోయే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారనే ఆపోహలలు, ప్రచారానికి బ్రేక్ వేసింది. క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏపీలోనే ఏర్పాటు చేస్తామని ఇటీవల జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దీంతో కృష్ణా జిల్లాలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం ఏర్పాటు కాబోతుందనే దానిపై స్పష్టత వచ్చింది.

భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దేశంలో మరో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే 2011లో ఏపీకి ఈ ప్రాజెక్టును కేటాయించింది. అప్పట్లోనే ఈ మిస్సైల్ సెంటర్ నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామం అనువైన ప్రాంతంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉండటం, గ్రామం చుట్టుపక్కల 6-8కిలోమీటర్ల మేర ఎలాంటి జనావాసాలు లేకపోవడంతో మిస్సైల్ టెస్టింగ్ ప్రయోగాలకు ఈ గ్రామం అనుకూలంగా ఉంటుందనే భావనకు వచ్చారు. అయితే అప్పుడే ప్రాజెక్టుకు భూమిని కేటాయించాలని డీఆర్డీవో అధికారులు కొరగా ..రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది కాస్తా ఆలస్యమైంది. ఇక ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 300 ఎకరాలకుపైగా భూమిని డీఆర్డీవో కు కేటాయించింది. అయితే పర్యావరణ అనుమతులు మరియు ఇతర అడ్డంకుల కారణంగా కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. దీంతో 2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించడంతో 2021లో ఆ స్థలాన్ని డీఆర్డీవో స్వాధీనం చేసుకొంది. ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం చుట్టూ ప్రహారి గోడను నిర్మించింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరగలేదు. అయితే ఈ ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఈ కేంద్రానికి వర్చువల్గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో రద్దైనట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అయితే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మోదీ ప్రారంభించనున్నట్టు సమాచారం.
ఈ మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నిర్మాణం పూర్తయితే, ఇది ఒడిశాలోని బాలాసోర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ తర్వాత భారతదేశంలో రెండవ ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రంగా మారుతుంది. ఇది షార్ట్-రేంజ్ మరియు లాంగ్-రేంజ్ క్షిపణుల పరీక్షలకు సహాయపడుతుంది, దీనివల్ల భారత రక్షణ రంగంలో స్వావలంబన మరియు సాంకేతిక పురోగతి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..