విశాఖ గ్యాస్ లీకేజీ ఎఫెక్ట్…మరో రెండు రోజుల పాటు..
వెంకటాపురం వద్ద ఇంకా కొంత శాతం గాలిలో స్టైరెన్ శాతాన్ని గుర్తించినట్లు సీఎస్ పేర్కొన్నారు. అయిదు గ్రామాల ప్రజలను
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదం ఇంకా వణికిస్తోంది. సంఘటనా స్థలానికి చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేర ప్రజలంతా ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. కంపెనీ నుంచి వెలువడుతున్న విషవాయువును అదుపు చేసేందుకు సహాయక సిబ్బంది ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఇందుకు గుజరాత్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించారు అయితే, ఏపీ సీఎస్, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఎఫెక్ట్పై అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ సందర్బంగా ఏపీ సీఎస్ నీలం సాహ్నిమాట్లాడుతూ…ఘటనా స్థలం నుంచి ఖాళీచేసిన ప్రజలు మరో రెండు రోజుల పాటు సొంత గ్రామాల్లోకి వెళ్లొద్దని నీలం సాహ్ని సూచించారు. గ్యాస్ లీకేజీని అదుపులోకి తీసుకు వస్తున్నామని, బాధితులందరూ కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. వెంకటాపురం వద్ద ఇంకా కొంత శాతం గాలిలో స్టైరెన్ శాతాన్ని గుర్తించినట్లు సీఎస్ పేర్కొన్నారు. అయిదు గ్రామాల ప్రజలను 48 గంటల పాటు గ్రామాలలోకి వెళ్లవద్దని, ప్రభుత్వ క్యాంపులోనే కొనసాగాలని సూచించారు. విశాఖ బాధితులకి అన్నిరకాల సాయం అందిస్తున్నామని, బాధితులకి నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో సైతం ప్రమాద ఘటనపై విచారణకు టెక్నికల్ కమిటీని నియమించామని, ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీ విచారణ ప్రారంభించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నీలం సాహ్ని పేర్కొన్నారు. గ్యాస్ దుర్ఘటనపై అత్యున్నత స్ధాయి కమిటీ విచారణ జరుగుతోందని తెలిపారు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్.