విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
స్థానికులు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు కోరినా... పరిస్థితి అదుపులోకి రాలేదు.
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే కంపెనీని మూసివేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోనకారులను చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు పరిశీలించగా…
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను చూసేందుకు డీజీపీ సవాంగ్తో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనాలనికి వెళ్లగా… స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహాలతో ఆందోళనకు దిగిన స్థానికులు తమకు న్యాయం చెయ్యాలంటూ… డీజీపీ, మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కంపెనీని వెంటనే మూసివేయాలంటూ పెద్ద ఎత్తున గుమిగూడిన జనం నినాదాలు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. గ్యాస్ లీక్ ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. ఇప్పటివరకు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.. దాంతో… పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో…పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సంయమనం పాటించాలని పోలీసు అధికారులు కోరినా… పరిస్థితి అదుపులోకి రాలేదు. పరిశ్రమ గేట్లను తోసివేసి… స్థానికులు లోపలికి వెళ్లి మరీ డీజీపీ, మంత్రిని అడ్డుకున్నారు. మృతదేహాలతో ధర్నాకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.