AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖ కోర్ట్ ప్రాంగణంలో దొంగా పోలీస్ ఆట.. బాత్‌రూమ్‌లో దాక్కుని ఏం చేశాడంటే…

చదివే వాళ్లకు ఈ వార్త కాస్త ఆసక్తిని, ఆనందాన్ని కలిగించినా ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులతో పాటు మొత్తం విశాఖ నగర పోలీసులను ఆందోళనకు గురి చేసిన సంఘటన ఇది. బాత్ రూమ్‌లోనే దాక్కున్న దొంగ క్షణకాలంలో అదృశ్యం అయ్యే సరికి అతనికి కాపలాగా వచ్చిన ఏఅర్ పోలీసుల గుండె జారిపోయినంత పనైంది. ఆ తొందరలో అక్కడే ఉన్న బాత్ రూంలో నక్కి ఉన్న ఆ దొంగను గుర్తించలేకపోయారు. ఒకసారి బాత్ రమ్‌ను తనిఖీ చేసినా గుర్తు పట్టకపోవడం, ఇంకేముంది పారిపోయాడని..

Andhra Pradesh: విశాఖ కోర్ట్ ప్రాంగణంలో దొంగా పోలీస్ ఆట.. బాత్‌రూమ్‌లో దాక్కుని ఏం చేశాడంటే...
Thieve Try To Escape
Eswar Chennupalli
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 06, 2023 | 7:36 AM

Share

Visakhapatnam: చదివే వాళ్లకు ఈ వార్త కాస్త ఆసక్తిని, ఆనందాన్ని కలిగించినా ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులతో పాటు మొత్తం విశాఖ నగర పోలీసులను ఆందోళనకు గురి చేసిన సంఘటన ఇది. బాత్ రూమ్‌లోనే దాక్కున్న దొంగ క్షణకాలంలో అదృశ్యం అయ్యే సరికి అతనికి కాపలాగా వచ్చిన ఏఅర్ పోలీసుల గుండె జారిపోయినంత పనైంది. ఆ తొందరలో అక్కడే ఉన్న బాత్ రూంలో నక్కి ఉన్న ఆ దొంగను గుర్తించలేకపోయారు. ఒకసారి బాత్ రమ్‌ను తనిఖీ చేసినా గుర్తు పట్టకపోవడం, ఇంకేముంది పారిపోయాడని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, వెంటనే ఆ చుట్టుపక్కల స్టేషన్ లతో పాటు నగరం అంతా అలెర్ట్ ప్రకటించడం, బస్ స్టేషన్ లు, రైల్వే స్టేషన్ లు అన్నింటిలో వందల మంది పోలీసులు వెళ్లి జల్లెడ పట్టడం ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా గాజువాక సమీప ప్రాంతాల్లో ఆటోలు, బైకు లు చివరకు నడచివెళ్తున్న వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి కానీ పంపలేదు. అయినా ఫలితం దక్కలేదు. మూడు గంటల సేపు వందలాది పోలీసులు ఆ పనిలో నిమగ్నమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఓ దొంగతనం కేసులో విచారణకు వచ్చి.. మరో కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ..

వందలమంది పోలీసులను పరిగెట్టించిన ఈ ఖైదీ పేరు పంకజ్ కుమార్ యాదవ్. తండ్రి నోలార్ సింగ్ యాదవ్, వయసు 27 సంవత్సరాలు మాత్రమే..ఇతని స్వగ్రామం బీహార్‌ రాష్ట్రం, సివావు జిల్లా బాంగ్రా పోస్ట్, మహారాజ్ గంజ్ సమీపంలోని తెవ్తా గ్రామం. ఈ అంతరాష్ట్ర దొంగ విశాఖలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. అయితే మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాల్లో అతని పాత్ర రుజువైంది. అందులో ఒకటి Cr no 230/2023. u/s 379 & 411 IPC సెక్షన్ లు కగా ఈ కేసులో ఇటీవల గాజువాక కోర్టు దోషిగా నిర్ధారించింది. 2 సంవత్సరాల పాటు కఠినమైన కారాగార శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా కూడా విధించింది.

మరొక దొంగతనం కేసులో కోర్టు విచారణకు గార్డ్స్‌తో వచ్చిన ఖైదీ..

ఇప్పటికే విశాఖ కేంద్ర కారాగారంలో ఒక కేసులో శిక్ష అనుభవిస్తున్న పంకజ్ యాదవ్ ను మల్కాపురం స్టేషన్ లో నమోదైన క్రైం నంబర్ 86/22 కేసులో వాయిదా కోసం ఈరోజు సెంట్రల్ జైలు నుంచి గాజువాక మూడవ ఏసీఎంఎం కోర్టుకు తీసుకొచ్చారు. అతనికి ఇద్దరు ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లను గార్డ్స్ గా నియమించి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే కోర్టు వ్యవహారం ముగిశాక నేచర్ కాల్ కోసం అంటూ ఎస్కార్ట్ వాళ్ళ దగ్గర నుంచి కాస్త ముందుకు వెళ్లినట్టు నటించి గోడ దూకి పారిపోయాడు. కళ్ళ ముందే క్షణాల్లో జరిగిన ఆ పరిణామాన్ని ఊహించని ఏఅర్ కానిస్టేబుళ్లు దొంగను వెంబడించినా వాడి ఆచూకీ కనిపెట్టలేక పోయారు.

మళ్లీ అదే కోర్టు బాత్‌రూమ్‌లో..

ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో గార్డ్స్ గా వచ్చిన ఏఅర్ కానిస్టేబుళ్లు వెంటనే కంట్రోల్ రూమ్‌కు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో వైర్లెస్ రేడియో మెసేజ్ సమీపంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళింది. వెంటనే స్టేషన్ ల నుంచి రోడ్లపైకి వచ్చిన జోన్ 2 పోలీసులు మొత్తం జల్లెడ పట్టారు. మొత్తం రాత్రి 7.30 గంటల వరకు ఆ ప్రాంతంలో అణువణువూ జల్లెడ పట్టారు. ఈ లోపు ఎటైనా పాటిపోతాడేమో అని అతని ఫోటో తెప్పించి అన్ని బస్ స్టేషన్ లు, రైల్వే స్టేషన్ లకు సమాచారం ఇచ్చారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. అంతర్ రాష్ట్ర దొంగ కావడంతో మరింత క్షుణ్ణంగా వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో అసలు పారిపోయిన చోటు నుంచి వెతకడం ప్రారంభించిన ఒక బృందానికి దొంగ పంకజ్ యాదవ్ అక్కడే బాత్ రూమ్‌లో నక్కి దొరకడంతో తక్షణం మళ్లీ దొరికినట్టు అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అప్పటి దాకా ఊపిరి బిగపట్టి ఉన్న పోలీసులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

అలా క్షణకాలం పాటు అప్రమత్తంగా లేకపోవడంతో ఆ ఏఅర్ కానిస్టేబుళ్లు పడ్డ యాతన నిజంగా మాటల్లో వర్ణించలేం. అందుకే కొన్ని పనుల్లో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియచెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..