Andhra News: అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క.. మూత్ర విసర్జన కోసం బయటకు రాగా..
వీధి కుక్కల దాడులకు ప్రజలు బలవుతూనే ఉన్నారు. ఏదో ఒక ప్రాంతంలో చిన్నారుల ప్రాణాలను బలి తీసూకుంటూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధికుక్కలు అలజడి సృష్టించాయి. గుంటూరులో స్వైర విహారం చేశాయి. వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో స్వర్ణభారతి నగర్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఏపీ గుంటూరు స్వర్ణభారతినగర్లో దారుణం జరిగింది. వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో చర్చి నుంచి బయటకు వచ్చిన ఐజాక్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మెడను కొరికేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. బాలుడు చనిపోయాడు. చిన్నారి మృతితో స్వర్ణభారతి నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. నాగరాజు, రాణిమెర్సి దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. వారిలో ఐజక్ మూడో సంతానం. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు ఐజాక్ ను ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లగా.. మధ్యలో మూత్రవిసర్జన కోసం బాలుడు బయటకు వచ్చాడు.. అక్కడ ఉన్న ఓ కుక్క ఐజాక్ పై దాడిచేసింది. బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లగా ఇరుగు పొరుగువారు చూసి వెంబడించడంతో వదిలి పెట్టింది. శునకం దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
ఈ ఘటన అనంతరం ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఇలాంటి దారుణం మరెక్కడ, ఏ ప్రాణికి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఐజాక్ కుటుంబ సభ్యులు. దాడులు చేసే కుక్కలను కొడుతుంటే .. జంతు ప్రేమికులు తిరిగి కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఇప్పటికే వీధి కుక్కల పున:రుత్పత్తి లేకుండా గత జూన్ నుంచి చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు గుంటూరు మున్సిపల్ అధికారులు. ఈమధ్య కాలంలో డాగ్ లవర్స్ పేరుతో కొంతమంది జంతు ప్రేమికుల ముసుగులో బాధ్యతారహింగా వ్యవహరిస్తున్నారని.. గుంటూరు మున్సిపాలిటీ చేపట్టే డ్రైవ్కి ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్తున్నారు అధికారులు. తమ సిబ్బందిపై కూడా దాడులు చేస్తున్నారని దీనిపై ఇప్పటికే కేసులు పెట్టామని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్లెన్స్ ప్రకారం కుక్కల విషయంలో నడుచుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
ఏదిఏమైనా ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఈక్షణం నుంచే స్పెషల్ డ్రైవ్ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు మున్సిపాలిటీ అధికారులు. మరోవైపు బాలుడి మృతిపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
