Tirumala: టీటీడీ ఆల్ టైమ్ రికార్డ్.. గతేడాది ఎన్ని కోట్ల లడ్డూలు అమ్మిందో తెలిస్తే అవాక్కే..
2025 ఏడాదిలో టీటీడీ అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. మెరుగైన సేవలతో ఆల్ టైం రికార్డ్స్ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇంతటి పవిత్రమైన లడ్డుకు సంబంధించి టీటీడీ 2025లో మరో రికార్డును నెలకొల్పింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించింది. 2025 ఏడాది 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది. 2024లో 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది 1.37 కోట్ల లడ్డూలను అదనంగా విక్రయించింది. గత ఏడాదితో పోల్చితే 10 శాతం అధికంగా అమ్మకాలు సాగించింది. లడ్డూ రుచి, నాణ్యతపై భక్తుల్లో సంతృప్తినే రికార్డ్ స్థాయిలో లడ్డూల విక్రయానికి కారణమని టీటీడీ అభిప్రాయపడుతోంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
టీటీడీ రోజూ దాదాపు 4 లక్షలకుపైగా లడ్డూలను పోటులో తయారు చేస్తుంది. రద్దీ రోజుల్లో బఫర్ స్టాక్గా 8 లక్షలకు పైగా లడ్డూలను నిల్వ ఉంచుతోంది. నిరంతరాయంగా రెండు షిప్ట్ల్లో లడ్డు ప్రసాదం తయారీ చేసేందుకు 700 మందికి పైగా శ్రీ వైష్ణవులను తిరుమల శ్రీవారి పోటులో టీటీడీ నియమించింది.
దర్శనాలోనూ రికార్డే..!
ఇక శ్రీవారి లడ్డూల అమ్మకాల్లోనే కాకుండా 2025 ఏడాది లో టీటీడీలో మరిన్ని రికార్డులను అధిగమించింది. శ్రీవారి లడ్డు విక్రయాలతో పాటు భక్తుల సంఖ్య, శ్రీవారి హుండీ ఆదాయం పెరిగినట్లు చెబుతోంది. 2025 హుండీ ఆదాయం రూ 1338.90 కోట్లు రాగా 2024 తో పోల్చితే రూ. 18 కోట్లు అదనంగా వచ్చిన హుండీ ఆదాయం శ్రీవారి ఖాతాకు జమ అయ్యింది. 2025లో శ్రీవారిని 2.61 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 2024లో 2.55 కోట్ల మంది దర్శించుకున్నారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందించి రికార్డులను బ్రేక్ చేసింది.
